ఇండియ‌న్ చెస్ స్టార్స్.. అద్భుతం చేశారు

భార‌త చెస్ చ‌రిత్ర‌లో ఈ ఆదివారం ఒక ప్ర‌త్యేకమైన రోజు. మ‌న చ‌ద‌రంగ తార‌లు మ‌న దేశ చెస్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద విజ‌య‌న్నందుకున్నారు ఈ రోజు. ప్ర‌తిష్ఠాత్మ‌క చెస్ ఒలింపియాడ్‌లో భార‌త్ తొలిసారిగా స్వ‌ర్ణం సొంతం చేసుకుంది.

93 ఏళ్ల టోర్నీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా భార‌త్ ఒక్క‌సారి మాత్ర‌మే ప‌త‌కం గెలిచింది. 2014లో కాంస్యం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా ప‌స‌డి నెగ్గి చ‌రిత్ర సృష్టించింది. ఈ విజ‌యంలో మ‌న తెలుగు చెస్ తార‌లు కోనేరు హంపి, ద్రోణ‌వ‌ల్లి హారిక‌, పెంటేల హ‌రికృష్ణ‌ల‌ది కీల‌క పాత్ర‌. వీరితో పాటు విశ్వ‌నాథ‌న్ ఆనంద్, విదిత్ గుజ‌రాతి, ప్ర‌జ్ఞానానంద‌, దివ్య దేశ్ ముఖ్‌, భ‌క్తి కుల‌క‌ర్ణి విజ‌యంలో త‌మ వంతు పాత్ర పోషించారు.

క‌రోనా నేప‌థ్యంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్‌ను ఆన్ లైన్ ద్వారా నిర్వ‌హించారు. ఐతే భార‌త్‌కు ప‌సిడి నాట‌కీయ రీతిలో ద‌క్కింది. ర‌ష్యాతో ఒక ద‌శ‌లో భార‌త్ 1.5-2.5తో వెనుక‌బ‌డింది. కానీ ఆ ద‌శ‌లో చివ‌రి రెండు గేమ్‌లు ఆడుతున్న భార‌త క్రీడాకారులు ఆధిక్యంలో క‌నిపించారు. గేమ్‌లు కొన‌సాగితే వాళ్లే విజేత‌లుగా నిలిచేవాళ్లు. భార‌త్‌కు టైటిల్ సొంత‌మయ్యేది. కానీ ఆ స‌మ‌యంలో స‌ర్వ‌ర్ డౌన్ అయి గేమ్‌లు తేడా అయిపోయాయి. సాంకేతికంగా భార‌త క్రీడాకారులిద్ద‌రూ ఓడిపోయిన‌ట్లు టోర్నీ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

దీంతో భార‌త్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయింది. ఐతే సాంకేతిక కార‌ణాల‌తోనే మ‌న‌వాళ్లు ఓడిపోయిన‌ట్లు తేలింద‌ని.. ఇది స‌మంజ‌సం కాద‌ని మ‌న బృందం మ‌ళ్లీ గేమ్‌లు నిర్వ‌హించాల‌ని కోరింది. అలా సాధ్యం కాద‌ని తేల్చిన ఫిడె.. భార‌త్‌, ర‌ష్యా రెండు జ‌ట్ల‌నూ విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అలా భార‌త్ నాట‌కీయ రీతిలో చెస్ ఒలింపియాడ్ విజేత‌గా నిలిచింది.