“ఇండియా గెలిస్తే.. 100 కోట్లు పంచుతా“

ఆదివారం జ‌ర‌గ‌నున్న ఇండియా-ఆస్ట్రేలియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌పై ఉత్కంఠ తీవ్ర‌స్థాయిలో ఉంది. ఈ క్ర‌మంలో భార‌త్ గెలిస్తే.. 100 కోట్ల రూపాయ‌లు పంచుతానంటూ.. ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్‌  సీఈవో పునీత్‌ గుప్తా బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. పునీత్ కూడా కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఈ బంపరాఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని, ఇవి త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తాన‌ని సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలిపారు.

‘‘2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్‌ చూశా. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ రోజు మేం ఎంతో ఎంజాయ్‌ చేశాం. నా జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు టీమ్‌ఇండియా మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. ఈసారి భారత్‌ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా“ అని పునీత్ గుప్తా పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలోనే త‌న ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని,  ఇప్పుడు  ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా త‌న‌ స్నేహితులేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. వారితో కలిసి త‌న‌ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో భారత్‌ ప్రపంచకప్‌ను ముద్దాడితే సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నట్టు పునీత్ వెల్ల‌డించారు.  కాగా, పునీత్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ రాజ‌కీయ నేతల నుంచి బిల‌య‌నీర్ల వ‌ర‌కు ఆయ‌న‌కు క‌స్ట‌మ‌ర్లుగా ఉన్నారు.