కోహ్లీ@50..మోడీ, సచిన్ ఫిదా!

టీమిండియా క్రికెటర్, ప్రపంచం గర్వించదగ్గ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలో మరే క్రికెటర్ కు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా కింగ్ కోహ్లీ అవతరించాడు. ఈ రోజు న్యూజిల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 50వ సెంచరీ నమోదు చేశాడు. కొంతకాలంగా ఊరిస్తున్న ఈ రికార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సమక్షంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోహ్లీ అధిగమించడం విశేషం. 113 బంతుల్లో 117 రన్స్ చేసిన కోహ్లీతోపాటు శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీ చేశాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ,శుభ్ మన్ గిల్ అర్ధ సెంచరీలతో దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాను తొలిసారిగా కోహ్లీని డ్రెస్సింగ్ రూంలో కలిసినప్పుడు.. తన పాదాలు తాకాలని మిగతా ఆటగాళ్లు ప్రాంక్ చేశారని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ తన అంకితభావం, నైపుణ్యంతో తన హృదయాన్ని తాకాడని, ఆనాటి యువకుడు ‘విరాట్’గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఒక భారతీయుడు తన రికార్డును బద్దలు కొట్టినందుకే కాకుండా, ప్రపంచకప్ సెమీస్‌లో తన హోం గ్రౌండ్‌లో ఈ రికార్డు సాధించినందుకు గర్వంగా ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఈ ఘనత సాధించిన విరాట్ కోహ్లీకి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ తన 50 సెంచరీని సాధించడమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి కనబరిచారని, ఈ అద్భుతమైన మైలురాయి అతడి నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం అని కొనియాడారు. భవిష్యత్ తరాలకు కోహ్లీ బెంచ్‌మార్క్ సెట్ చేస్తూనే ఉన్నాడని ట్వీట్ చేశారు. 50వ సెంచరీ సాధించి, చారిత్రక మైలురాయిని సాధించిన కోహ్లీకి షా అభినందనలు తెలిపారు. ఆటను మరింత స్థాయికి ఎదగనివ్వాలని, దేశం మొత్తం కోహ్లీని చూసి గర్విస్తోందని చెప్పారు.