ఆ బస్సు టికెట్ జస్ట్.. రూ.15 లక్షలు మాత్రమే?

మీరు చదివింది నిజమే. ఆ బస్సు టికెట్ రూ.15లక్షలు. ఇంత ఖరీదు పెట్టి.. ఎవరైనా బస్సు ఎక్కుతారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలు విన్న తర్వాత మాత్రం మీ అభిప్రాయాన్ని మార్చుకోక మానరు.

కాకుంటే.. ఈ బస్సులో ప్రయాణం చేయాలంటే గుండెల నిండుగా దమ్ము ఒక్కటే సరిపోదు.. భారీగా డబ్బున్నోళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంతకీ రూ.15లక్షల ఖరీదైన టికెట్ ఉన్న ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతుంది? ఎందుకింత భారీగా టికెట్ రేటు డిసైడ్ చేశారన్న వివరాల్లోకి వెళితే..

గుర్ గ్రామ్ కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ వినూత్నమైన సాహస యాత్రకు తెర తీసింది బస్సులో ఢిల్లీ నుంచి లండన్ కు వెళ్లే.. ఈ జర్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 18 దేశాల గుండా 70 రోజుల పాటు 20వేల కి.మీ ప్రయాణించే ఈ యాత్రకు బస్ టు లండన్ అనే పేరు పెట్టారు. ఇది మామూలు జర్నీ కాదని.. సాహస యాత్రగా నిర్వాహకులు పేర్కొంటున్నారు.

బస్సు జర్నీలో భాగంగా మయన్మార్.. థాయ్ లాండ్.. లావోస్.. చైనా.. కిర్గిస్థాన్.. ఉబ్జెకిస్థాన్.. కజకిస్థాన్..రష్యా.. లాట్వియా.. లిథువేనియా.. పోలాండ్.. చెక్ రిపబ్లిక్.. జర్మనీ.. నెదర్లాండ్స్.. బెల్జియం.. ఫ్రాన్స్ దేశాల మీదుగా ఈ బస్సు వెళ్లనుంది. ఈ బస్సు సామర్థ్యం కేవలం 20 సీట్లు మాత్రమే. ఈ జర్నీ కోసం ఇద్దరు డ్రైవర్లు.. ఒక గైడ్.. ఒక సహాయకుడు ఉంటారు.

ప్రయాణం చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులో ప్రయాణం చేయాలనుకునే వారికి అవసరమైన అన్ని వీసా వ్యవహారాల్ని ట్రావెల్స్ సంస్థే చూసుకోనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మే 21న ఈ ప్రయాణం స్టార్ట్ కావాల్సి ఉంది. కాకుంటే.. కరోనా కారణంగా వాయిదా పడింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎవరైనా ప్రయాణికులు లండన్ వరకు కాకుండా.. తాము కోరుకున్న దేశం వరకు మాత్రమే జర్నీ చేయాలన్నా కూడా.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తారు. అందుకు తగ్గట్లే.. టికెట్ ధర ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఇంత భారీ జర్నీ చేయటానికి ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి. అయితే.. జర్నీ డేట్స్ ను మాత్రం ట్రావెల్ సంస్థ ఇప్పటివరకు వెల్లడించలేదు.