ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోరం : రోగిసోదరిపై రేప్!

హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకున్న దారుణం షాకింగ్ గా మారింది. చికిత్స కోసం సోదరుడు ఆసుపత్రిలో చేరితే.. అతడికి సాయంగా ఉండేందుకు వచ్చిన అతడి సోదరిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఆసుపత్రి క్యాంటీన్ సిబ్బంది ఒకరు చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోగులు.. వారి బంధువుల భద్రతపై కొత్త సందేహాలకు తావిచ్చేలా పరిస్థితులు నెలకొన్నాయి.

కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి సోదరుడు జారి పడిన ఉదంతంలో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో.. అతడ్ని సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే.. బాధితుడికి ఇటీవల నొప్పులు మళ్లీ తిరగబెట్టటంతో ఈ నెల ఆరున తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి (బాధితురాలు) వచ్చింది. శుక్రవారం రాత్రి సోదరుడికి భోజనం తీసుకురావటానికి ఆమె కిందకు వచ్చింది.

తిరిగి సోదరుడు ఉన్న గదికి వెళ్లే సమయంలో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆమెను కలిశాడు. అక్కడి క్యాంటీన్ లో పని చేసే పాతికేళ్ల షాదాబ్ ను పరిచయం చేశాడు. ఏమైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని చెప్పాడు. అనంతరం ఆమె లిఫ్టులో వెళుతున్నప్పుడు షాదాబ్ ఆమెను ఫాలో అయ్యి.. బలవంతంగా ఆమెను రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బ్లడ్ టెస్టులు చేసే గదిలో ఆమెను మరోసారి అత్యాచారం చేశాడు.

తనను లైంగికంగా వేధిస్తున్న అతడ్ని తప్పించుకోవటానికి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు వచ్చి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులకు ఈ విషయం మీద కంప్లైంట్ చేయగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. భాదితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు షాదాబ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఉదంతం ఆసుపత్రి వర్గాల్లో సంచలనంగా మారింది.