ఆదిత్య ఎల్ 1 లాంచింగ్ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఓవరాల్ గా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రపుటలలో నిలిచింది. చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన కిక్కుతో తాజాగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలోనే ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ లాంచింగ్ కార్యక్రమం విజయవంతమైంది.

ఉదయం 11.50 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భూమి దిగువ కక్షలో ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టారు. నాలుగు నెలలపాటు ఈ శాటిలైట్ ప్రయాణించి భూమికి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రెజ్ పాయింట్ కు చేరనుంది. దాదాపు ఐదేళ్లపాటు సూర్యుడిపై ఈ శాటిలైట్ అధ్యయనం చేయనుంది. సౌర తుఫానులు, సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్, మాస్ ఎజెక్షన్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రతిరోజు భూమికి సమాచారాన్ని ఆదిత్య చేరవేయనుంది.

ఈ నేపథ్యంలోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. విశ్వాన్ని అన్వేషించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని మోడీ అన్నారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి ప్రయోగాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.