గంజాయి: ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య!

గంజాయి మత్తుకు బానిసై ఆత్మహత్య చేసుకున్న ప్రియుడ్ని మరిచిపోలేక ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యానాం యూకేవీ నగర్‌ కు చెందిన మీసాల మౌనిక (22) తాళ్లరేవులో నర్సింగ్‌ కాలేజీలో నర్సింగ్‌ కోర్సును మూడో సంవత్సరం చదువుతుంది.

మౌనికకు 2 ఇద్దరు అక్కలు ఉండగా..వారిద్దరికీ పెళ్లి అయిపోగా..అప్పటి నుంచి కూడా మౌనిక మేనమామ వద్ద ఉండి చదువుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు నిమ్మకాయల చిన్నా అనే వ్యక్తి పరిచమయ్యాడు. సుమారు రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

చిన్నా కొంతకాలం నుంచి గంజాయికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే చిన్నాకి తన సోదరునికి డబ్బుల విషయంలో గొడవ జరగడంతో క్షణికావేశంలో రెండు నెలల క్రితం గంజాయి మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మౌనిక కుంగిపోయింది. అప్పటి నుంచి మౌనిక కాలేజీకి వెళ్లడం మానేసింది.

అతడినే తలుచుకుంటూ గడుపుతుంది. ఈ క్రమంలోనే చిన్నాకు సంబంధించిన దుస్తులు, కొన్ని వస్తువులను మౌనిక తన గదిలో ఉంచుకుని వాటిని చూస్తూ ఏడుస్తూండేది. చిన్నా ఫోటోలను కూడా గోడలకు వేలాడదీసింది. ప్రియుడి జ్ఞాపకాలతో జీవిస్తూ.. మానసికంగా కుంగుబాటుకు గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది.

కొంత సమయం తరువాత మేనమామ జరిగిన విషయాన్ని గమనించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని డెడ్ బాడీని హాస్పిటల్ తీసుకెళ్లి. పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.