ఆసియా కప్ లో ఆడనున్న తెలుగు తేజం తిలక్ వర్మ

ఆగస్టు 30వ తేదీ నుంచి జరగబోతున్న ఆసియా కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ లో ఆసియా కప్ జరగబోతున్న నేపథ్యంలో ఈ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే వన్డే ప్రపంచ కప్ నుకు ముందు టీమిండియాకు ఈ టోర్నీ సెమీ ఫైనల్ వంటిది. అందుకే ఈ టోర్నీని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆసియా కప్ లో పాల్గొనబోయే భారత క్రికెట్ జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టులో తెలుగు తేజం, హైదరాబాదీ యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు.

ఆగస్టు 30వ తేదీన పాకిస్థాన్ లోని ముల్తాన్ లో పాకిస్తాన్-నేపాల్ ల మధ్య మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. పాకిస్తాన్ తో పాటు శ్రీలంక ఆసియా కప్ కు సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక, పాక్ లో ఆడేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండో-పాక్ మ్యాచ్ ను సెప్టెంబర్ 2వ తేదీన శ్రీలంకలోని క్యాండీలో నిర్వహించనున్నారు. దాయాది జట్ల మధ్య జరగబోతున్న ఈ హై ఆక్టేన్ మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక, సెప్టెంబర్ 4వ తేదీన క్యాండీ వేదికగా భారత్ తన రెండో, చివరి గ్రూప్ మ్యాచ్ ను నేపాల్ తో ఆడనుంది.

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ జరగనుంది. నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ లో, తొమ్మిది మ్యాచ్ లు శ్రీలంకలో జరగనున్నాయి. మొత్తం ఆరు దేశాలు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా… గ్రూప్ బి లో బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. సెప్టెంబర్ 17న కొలంబోలో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. గ్రూప్ దశలో గెలిచి టాప్ 4 లో నిలిచిన నాలుగు జట్లు సూపర్ ఫోర్ దశలో తలపడనున్నాయి. సూపర్ 4 దశలో టాప్ 2 లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.

ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్ (రిజర్వ్ వికెట్ కీపర్)గా సంజు శాంసన్ ను ఎంపిక చేశారు.