సచిన్ ఒక్కడికే ఆ గౌరవం

ఒక దిగ్గజ క్రికెటర్ రిటైరవుతున్నాడంటే.. అతడికి ఫేర్‌వెల్ మ్యాచ్ ఉండాలని.. మైదానంలో అభిమానుల మధ్య చివరి మ్యాచ్ ఆడి ఘనంగా, గౌరవంగా తప్పుకునే అవకాశం ఉండాలని అభిమానులు ఆశించడం సహజం. క్రికెట్‌ను కేవలం ఒక ఆటలాగే చూసే విదేశాల్లోనూ క్రికెటర్లకు ఇలాగే వీడ్కోలు ఇస్తుంటారు.

అలాంటిది క్రికెట్‌ను ఒక మతంలా భావించి, క్రికెటర్లను పిచ్చిగా ఆరాధించే మన దేశంలో తమ ఆరాధ్య క్రికెటర్లకు అలాంటి వీడ్కోలు ఉండాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అది తప్పు కూడా కాదు. కానీ మన దగ్గర మాత్రం దిగ్గజ క్రికెటర్లు చాలామందికి అలాంటి అవకాశం దక్కట్లేదు. గత రెండు దశాబ్దాల్లో చాలామంది దిగ్గజ క్రికెటర్లు ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే మామూలుగా నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తింది.

అనిల్ కుంబ్లే మైదానంలోనే ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు కానీ.. మ్యాచ్ అయ్యాకే ఆ ప్రకటన చేశాడు. ముందుగా ఇది తన చివరి మ్యాచ్ అనలేదు. గంగూలీ విషయానికి వస్తే అతడిని జట్టు నుంచి తప్పించారు. మళ్లీ దేశవాళీల్లో రాణించి జట్టులోకి వచ్చాడు. అప్పుడు కూడా అతడికి ప్రాధాన్యం అంతంతమాత్రంగా కనిపించింది. సెలక్టర్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. దీంతో అతను అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాకపోతే చివరి మ్యాచ్ ఆడి సహచరుల గౌరవాన్నందుకుని, అభిమానుల మధ్య వీడ్కోలు తీసుకున్నాడు. అంతటితో సరి.. ఇంకే దిగ్గజ ఆటగాడికీ ఈ మాత్రం గౌరవం కూడా దక్కలేదు.

ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, యువరాజ్, గంభీర్.. భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలందించి, దిగ్గజ స్థాయి అందుకున్న ఆటగాళ్లందరూ మైదానం బయటే, ఎంతో కొంత అసంతృప్తితోనే రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్ల మనసేంటో తెలుసుకుని.. వీడ్కోలు మ్యాచ్ ఆడి గౌరవంగా నిష్క్రమించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించలేదు. ఇప్పుడు ధోనీ విషయంలోనూ అదే జరిగింది. అతను అలా ఆశించే ఆటగాడు కాదు కానీ.. బీసీసీఐ అయినా ఆ ఏర్పాటు చేయాల్సింది. ఈ విషయంలో ధోనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐతే గత రెండు దశాబ్దాల్లో పరిశీలిస్తే.. తాను కోరుకున్నపుడు రిటైర్మెంట్ ప్రకటించి.. ఇదే తన చివరి సిరీస్ అని చెప్పి.. ఆ రెండు మ్యాచ్‌లూ ఆడి.. సహచరులు, అభిమానుల మధ్య సంతోషంగా, సంతృప్తిగా, ఘనంగా వీడ్కోలు తీసుకున్న ఏకైక ఆటగాడు సచిన్ టెండుల్కర్ ఒక్కడే.