సీఎం ఇంటి గేటు ముందు కావాలనే కారు అడ్డుపెట్టిన నైబర్

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ఆయన ప్రయాణించే వాహనాల సముదాయానికి తన కారును అడ్డంగా పెట్టేసిన ఒక వ్యక్తి వైనం ఆసక్తికరంగా మారితే.. అందుకు ఆ ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. పిలిపించుకొని.. సదరు వ్యక్తిని శాంతపరిచిన ఈ ఉదంతం ఇప్పుడు వార్తాంశంగా మారింది. అయితే.. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశమే లేదన్నది మర్చిపోకూడదు. కాకుంటే తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉండే కర్ణాటకలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

ప్రముఖుల నివాసాలకు పక్కన ఉండే వారికి ఎదురయ్యే తిప్పలు అన్ని ఇన్ని కావు. కర్ణాటకకు మరోమారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య బెంగళూరు కుమార క్రప మార్గంలో నివాసం ఉంటారు. ఆయన ఇంటి పక్కనే పురుషోత్తమ్ అనే వ్యక్తి నివాసం ఉంటారు. అయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్ధూను కలిసేందుకు పొద్దున్నే వచ్చేసే వారంతా.. తమ వాహనాల్ని పురుషోత్తం ఇంటి ముందు పెట్టేస్తుంటారు.

దీంతో.. ఆయన తెగ ఇబ్బందికి గురవుతుంటారు. ఒక రోజు తన కారును బయటకు తీసేందుకు కూడా ఛాన్స్ లేకుండా కార్లను అడ్డంగా పెట్టేశారు. దీంతో.. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేని ఆయన చిర్రెత్తి సరిగ్గా సీఎం బయలుదేరే వేళ చూసుకొని.. తన కారును తీసుకొచ్చి కాన్వాయ్ కు అడ్డుగా పెట్టేశారు. దీంతో.. ఆ వాహనాన్ని పక్కకు తీసేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినలేదు.

అనూహ్యంగా ఏర్పడిన లొల్లితో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్దూ.. సదరు పక్కింటాయనను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆయనకు ఎదరవుతున్న అసౌకర్యం గురించి తెలుసుకొని.. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చిన తర్వాతే పురుషోత్తం తన వాహనాన్ని అడ్డుతీయటం గమనార్హం. అదే..తెలుగు రాష్ట్రాల్లో అయితే.. సదరు కారు ఎక్కడికో వెళ్లిపోయేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.