గిన్నిస్ రికార్డు ‘స్మాష్’ చేసిన సాత్విక్

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి పురుషుల బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. మెరుపు వేగంతో స్మాష్ కొట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను స్మాష్ చేశాడు. బ్మాడ్మింటన్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగంగా స్మాష్ కొట్టిన షట్లర్ గా సాత్విక్ సాయిరాజ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆడుతున్న సాయిరాజ్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ కొట్టి దుమ్మురేపాడు. బ్యాడ్మింటన్ హిస్టరీలో ఈ రేంజ్ లో బాహుబలి స్మాష్ కొట్టిన షట్లర్ సాత్విక్ ఒక్కడే.

సాత్విక్ తన మెరుపు స్మాష్ తో మలేషియాకు చెందిన టాన్ బూన్ హియాంగ్ పేరిట ఉన్న రికార్డును కూడా స్మాష్ చేశాడు. 2013 మేలో గంటకు 493 కిలోమీటర్ల వేగంతో హియాంగ్ స్మాష్ కొట్టాడు. ఆ రికార్డును సాత్విక్ తిరగరాశాడు. ఓ ఫార్ములా వన్ రేస్ కారు వేగం(372 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో సాత్విక్ స్మాష్ కొట్టడం విశేషం. కాగా, మహిళల విభాగంలో మలేషియాకు చెందిన టాన్ పియర్లీ పేరిట వేగవంతమైన స్మాష్ రికార్డు నమోదైంది. పియర్లీ గంటకు 438 కి.మీ వేగంతో స్మాష్ ను కొట్టింది.

ఈ సందర్భంగా యానెక్స్ కంపెనీ సాత్విక్ కు శుభాకాంక్షలు తెలిపింది. “యోనెక్స్ బ్యాడ్మింటన్ అథ్లెట్లు, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, టాన్ పెర్లీ అత్యంత వేగవంతమైన బ్యాడ్మింటన్ హిట్లతో కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పారని ప్రకటించడం గర్వంగా ఉంది” అని యోనెక్స్ ప్రకటించింది.

మరోవైపు, సాత్విక్‌ సాయిరాజ్‌ -చిరాగ్‌ శెట్టి జంట ఇండోనేషియా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గింది. ఈ ఘనత సాధించిన తొలి డబుల్స్‌ ప్లేయర్లుగా రికార్డును నెలకొల్పారు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌-1000 టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో 21-17, 21-18తో ఆరోన్‌ చియా-సో వుయిక్‌ (మలేషియా) ద్వయంపై సాత్విక్ ద్వయం విజయం సాధించింది.