కోహ్లి, రోహిత్‌లను ఇక మరిచిపోవచ్చు

సచిన్, ద్రవిడ్, గంగూలీ, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, గంభీర్ లాంటి మేటి క్రికెటర్లు నిష్క్రమించాక పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు దక్కిన పెద్ద బ్యాటింగ్ సూపర్ స్టార్లు అంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలే. ధోనీ కూడా బ్యాటింగ్‌లో గొప్ప స్థాయినే అందుకున్నప్పటికీ.. అతను భ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గానే ఎక్కువ పాపులర్. ధోని 2019 వన్డే ప్రపంచకప్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పేశాడు. ఆ తర్వాత భారత బ్యాటింగ్ చర్చలన్నీ ప్రధానంగా కోహ్లి, రోహిత్‌ల చుట్టూనే తిరిగాయి. ఐతే ఈ మేటి బ్యాటర్లు కూడా ఈ మధ్య ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ముందు విరాట్ ఫామ్‌తో తంటాలు పడి, తర్వాత కొంచెం గాడిన పడగా.. ఆపై రోహిత్ తడబడుతున్నాడు. వీళ్లిద్దరికీ వయసు 35 దాటింది. కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఫామ్ కూడా సరిగా లేదు. దీంతో రిటైర్మెంట్‌కు దగ్గర పడినట్లే కనిపిస్తున్నారు.

ఇంకో మూడు నెలల్లోనే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. అది పూర్తయ్యాక రోహిత్ రిటైరవుతాడనే చర్చ నడుస్తోంది. కోహ్లి కూడా వన్డేల్లో కొనసాగడం సందేహంగానే ఉ:ది. అసలు వన్డేలే క్రేజ్ కోల్పోతున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్లో వీళ్లిద్దరూ ఎంత కాలం కొనసాగుతారన్నది ప్రశ్న. ఆ ఫార్మాట్ సంగతి పక్కన పెడితే.. టీ20ల వరకు మళ్లీ కోహ్లి, రోహిత్‌లను టీమ్ ఇండియా జెర్సీల్లో చూడలేమనే అనిపిస్తోంది. గత ఏడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ తర్వాత వీళ్లిద్దరూ భారత్ తరఫున ఒక్క టీ20లోనూ ఆడలేదు. వరుసగా మూడు సిరీస్‌లకు దూరంగా ఉన్నారు. వీరిపై వేటు వేసినట్లు చెప్పలేదు. అలా అని విశ్రాంతి అనే మాటా వినిపించలేదు. రోహిత్ నుంచి కెప్టెన్సీ తీసి హార్దిక్ పాండ్యకు ఇచ్చారు.

తాజాగా వెస్టిండీస్‌తో ఆగస్టు 3 నుంచి జరిగే ఐదు టీ20లకు ప్రకటించిన జట్టులోనూ కోహ్లి, రోహిత్ లేరు. చూస్తుంటే ఇక టీ20ల్లో మీ సేవలు చాలని బీసీసీఐ వీళ్లిద్దరికీ చెప్పేసినట్లు కనిపిస్తోంది. లేదంటే కోహ్లి, రోహిత్‌లే ఇక తాము ఆ ఫార్మాట్లో ఆడమని బోర్డుకు చెప్పేసి ఉండొచ్చు. అలా ఒక ప్రకటన అంటూ లేకుండానే కోహ్లి, రోహిత్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేసినట్లయింది. ప్రపంచకప్ తర్వాత వన్డేలకు కూడా వీళ్లిద్దరూ టాటా చెప్పేస్తే ఆశ్చర్యం లేదు.