నీహారిక విడాకుల ఘట్టం సమాప్తం

రెండు మూడు నెలల క్రితమే మెగా డాటర్ నీహారిక ఆమె భర్త చైతన్య విడిపోతున్నారనే వార్త వచ్చినప్పటికీ వ్యవహారం కోర్టులో ఉన్నందు వల్ల ఆ జంట మౌనంగా ఉంటూ వచ్చింది. విడాకులు అధికారికంగా మంజూరు కావడంతో ఎట్టకేలకు తమ బంధం ముగిసిపోయిందని, కొత్త జీవితానికి ప్రైవసీ ఇమ్మని కోరుతూ ఇద్దరూ ఒకటే మెసేజ్ పెట్టారు. ఇటీవలే జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్, క్లిన్ కారా నామకరణం వేడుకల్లో అసలు చైతన్య కాని, అతని కుటుంబ సభ్యుల జాడ కానీ లేకపోవడంతోనే ఈ విషయాన్ని ధృవీకరించుకున్న మీడియాకు, జనాలకు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది.

కేవలం మూడేళ్ళకే ఈ బాండింగ్ ఇలా క్లైమాక్స్ కు వచ్చేయడం విచారకరం. గత కొన్నేళ్లలో ఇలాంటి సెలబ్రిటీ వెడ్డింగ్స్ డైవర్స్ దాకా వెళ్లడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తున్నాయి. చిరంజీవి రెండో కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ ల బంధం గురించి ఇప్పటికీ అఫీషియల్ క్లారిటీ లేదు. నాగ చైతన్య సమంతాల విషయంలో ఎంత చర్చ జరిగిందో చూశాం. అట్టహాసంగా పెళ్లి చేసుకుని, జీవితాలను పంచుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత తక్కువ టైంలో సెలవు చెప్పేసుకోవడం కొత్తేమీ కాకపోయినా ఒకప్పుడు కనీసం అయిదు నుంచి పదేళ్ల జీవనం తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు.

ఇప్పుడంత ఓపిగ్గా ఎదురు చూడటం లేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మాణంలో బిజీ కావాలని చూస్తున్న నీహారిక త్వరలోనే ఓ రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సుస్మిత తండ్రి చిరంజీవి హీరోగా త్వరలోనే భారీ చిత్రం మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో అన్నయ్య వరుణ్ తేజ్ తో నీహారిక సైతం ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తోందట. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో ఇలాంటి మ్యారేజ్ డిస్టర్ బెన్సులు తరచుగా వస్తూనే ఉన్నాయి. నీహారిక పెట్టిన సందేశాన్నే యధాతథంగా చైతన్య కూడా పోస్ట్ చేయడం గమనార్హం