టిక్ టాక్ మళ్లీ రానుందా?

చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జూన్ 29న సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను ఒకేసారి నిషేధించి వాటి యాజమాన్యాలకు, యూజర్లకు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది కేంద్రం. రెండు వైపులా ఆవేదన స్వరాలు వినిపించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. తమ నిర్ణయానికి కట్టుబడే ఉంది. మిగతా యాప్‌ల మాటేమో కానీ.. టిక్ టాక్‌ నిషేధంతో మాత్రం కోట్లాది మంది గగ్గోలు పెట్టారు. కొన్నేళ్లుగా తమ జీవనంలో భాగంగా మారిపోయిన టిక్ టాక్‌ను ఒకేసారి ఇలా విడిచిపెట్టడం చాలా కష్టమైంది. కొందరు సైలెంటయ్యారు. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. మళ్లీ టిక్ టాక్ రాకపోదా అన్న ఆశతో కొందరున్నారు.

ఐతే ప్రపంచవ్యాప్తంగా చైనా అవతల టిక్ టాక్ యూజర్లు 20 కోట్లకు పైగానే ఉండగా.. అందులో సగానికి పైగా భారతీయులే కావడం గమనార్హం. భారత్‌లో టిక్ టాక్ మీద 20 వేల కోట్ల దాకా బిజినెస్ జరుగుతోందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత బిజినెస్‌ను అంత సులువుగా ఎలా వదిలేసుకుంటారు. టిక్ టాక్ యాజమాని అయిన చైనా సంస్థ బైట్ డ్యాన్స్.. ఎలాగైనా ఆ యాప్‌ను తిరిగి తీసుకురావాలని కష్టపడుతోంది. ఓ అమెరికా సంస్థకు వాటాలిద్దామని ప్రయత్నించింది కానీ కుదర్లేదు. ఇప్పుడు బైట్ డ్యాన్స్.. భారతీయ సంస్థ జియోతో డీల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జియోకు మెజారిటీ వాటా ఇచ్చి ‘టిక్ టాక్’ను భారతీయ సంస్థగా మార్చి.. తద్వారా తిరిగి ఆ యాప్‌ను జన బాహుళ్యంలోకి తీసుకురావాలన్నది బైట్ డ్యాన్స్ ప్రయత్నం. ఇదెంత వరకు ఫలిస్తుందో చూడాలి మరి.