రిటైర్డు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో దోపిడీ.. రూ.100 కోట్లకు ఎస్ఐ స్కెచ్!

రిటైర్డు ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన దోపిడీ ఉదంతంలో కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో పాత్రధారి రియల్టర్ సురేందర్ అయితే.. సూత్రధారి ఎస్ఐ క్రిష్ణ అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రిటైర్డు ఐఆర్ఎస్ అధికారికి చెందిన రూ.100 కోట్ల విలువైన భూముల్ని కొట్టేయాలన్న స్కెచ్ లో భాగంగా దస్తావేదుల దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

మాజీ ఐఆర్ఎస్ అధికారికి మత్తు మందుతో కూడిన ఆహారాన్ని ఇచ్చి.. అనంతరం వారింట్లో భూమి పత్రాలతో పాటు.. వెండి.. బంగారాన్ని దోచికెళ్లిన వైనం ఆలస్యంగా బయటకు రావటం తెలిసిందే. పోలీసు వర్గాల్లో పెను సంచనలనంగా మారిన ఈ ఉదంతంపై తొలుత పోలీసులు పెద్ద ఆసక్తి చూపించకున్నా.. స్వయంగా పోలీస్ బాస్ సీన్లోకి రావటంతో ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం జరిగిందేమిటన్న అంశాల్ని ఆరా తీస్తున్న అధికారులకు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

శామ్యూల్ ప్రసాద్ కు హైదరాబద్.. వికారాబాద్.. చేవెళ్లతో పాటు ఏపీలోని విశాఖలోనూ బంధుమిత్రుల పేర్లుతో రూ.వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. శామ్యూల్ భార్య మరణించగా.. ఇద్దరు కుమారులు.. కుమార్తెలు అమెరికాలో సెటిల్ అయ్యారు. 20 ఏళ్లుగా వారు హైదరాబాద్ కు రాలేదు. శామ్యూల్ ఒంటరిగా ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. మూడేళ్ల క్రితం వికారాబాద్ దగ్గర్లోని మద్దూరులో 8 ఎకరాల భూమిని రియల్టర్ సురేందర్ ద్వారా.. ఎస్ ఐ క్రిష్ణకు అమ్మారు శామ్యుల్ ప్రసాద్. దీనికి సంబంధించి మూడు ఎకరాలకు సంబంధించిన అంశంలో వివాదం నడుస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రిటైర్డు అధికారి శామ్యూల్ కు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ క్రిష్ణ.. అయిన వారంతా ఎక్కడో దేశం కాని దేశంలో ఉండటం.. అతడి దగ్గర రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న విషయాన్ని గుర్తించి.. వాటిని కొట్టేసే స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా శామ్యుల్ కు బాగా పరిచయం ఉన్న సరేందర్ సాయం తీసుకొని.. ఎస్ఐ క్రిష్ణ సూచనలతో మత్తు మందు కలిపిన ఆహారాన్ని ఇచ్చారు. స్ప్రహ కోల్పోయిన వెంటనే.. ఇంట్లో ఉన్న ఆస్తిపత్రాలతో పాటు.. బంగారు.. వెండి ఆభరణాల్ని దొంగలించారు. ఇందులో భాగంగా రూ.5 లక్షల క్యాష్ ను కూడా దోచాడు.

ఇంట్లో దొంగతనం జరిగిందన్న భావన కలిగేలా ఇంట్లోని వస్తువుల్ని చిందరవందర చేశారు. ఆ ఆస్తుల్ని సబ్ రిజిస్ట్రార్ సాయంతో కొట్టేయాలని పథకం వేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. ఎస్ఐ క్రిష్ణ ప్లాన్ వేసినా.. సామ్యూల్.. క్రిష్ణ.. సురేందర్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్.. చాటింగ్ సంభాషణలు.. సీసీ ఫుటేజ్ లతో పోలీసులు మొత్తం విషయాల్ని వెలికితీశారు. దీంతో పాటు సురేందర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లుగా చెప్పేశారు. అతడి దగ్గర నుంచి భూమి పత్రాల్ని పోలీసు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది.

ఈ ఉదంతం వెలుగు చూసిన నాటి నుంచి ఎస్ఐ క్రిష్ణ పరారీలో ఉన్నారు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. శామ్యూల్ కు చెందిన 40 దాకా ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ క్రిష్ణను అదుపులోకి తీసుకునేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పోలీస్ బ్రెయిన్ తో నేరం చేసిన ఎస్ఐ క్రిష్ణ.. టెక్నాలజీ పుణ్యమా అని అడ్డంగా దొరికిపోయినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.