భార్యా భ‌ర్త‌ల సెక్స్‌ పై కోర్టు తీర్పుల‌తో తిక‌మ‌క‌!

భార్యా భ‌ర్త‌ల సెక్స్‌పై రెండు రాష్ట్రాల హైకోర్టు వారాల వ్య‌వ‌ధిలోనే ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా తీర్పులు ఇచ్చాయి. వివాహం చేసుకున్న త‌ర్వాత భ‌ర్త అయినా.. భార్య అయినా.. శృంగారానికి నిరాక‌రిస్తే.. అది నేర‌మేన‌ని.. వారం రోజుల కింద‌ట బాంబే హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇది విడాకుల‌ను కోరుకునేందుకు ఒక హ‌క్కుగా కూడా పేర్కొంది. అయితే..తాజాగా క‌ర్ణాట‌క హైకోర్టు దీనికి విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. వివాహం చేసుకున్నంత మాత్రాన శృంగార‌మే ప‌ర‌మావ‌ధి కాద‌ని.. దీనిని నిరాక‌రించినంత‌ మాత్రాన నేరంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. దీనిని బూచిగా చూపించి విడాకులు కోర‌లేర‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో భార్యా భ‌ర్త‌ల సెక్స్‌పై తిక‌మ‌క ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

తాజా తీర్పు ఇదీ..

పెళ్లి తర్వాత భార్యతో శృంగారానికి నిరాకరించడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం శారీరక సంబంధానికి నిరాకరించడం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది నేరం కాదని స్పష్టం చేసింది. భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి నిరాకరించడం వల్ల తన వివాహం పరిపూర్ణం కాలేదని పేర్కొంటూ ఓ మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తన భర్త, అత్తామామలపై మహిళ పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.

న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన మహిళకు 2019 డిసెంబర్ 18న వివాహం జరిగింది. ఆమె భర్త ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవాడు. ఈ నేపథ్యంలో మహిళతో శారీరక బంధాన్ని ఏర్పరచుకునేందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆ మహిళ 28 రోజులు మాత్రమే అత్తింట్లో ఉండి.. పుట్టింటికి వచ్చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద.. తన భర్త, అత్తామామలపై 2020 ఫిబ్రవరిలో కేసు పెట్టింది. దీంతో పాటు తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని పేర్కొంటూ హిందూ వివాహ చట్టం ప్రకారం కేసు పెట్టింది. తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

మహిళ పిటిషన్పై విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబర్లో వీరి పెళ్లిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. భర్త, అత్తామామలపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో మహిళ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్షీట్ను ఆయన సవాల్ చేశాడు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శారీరక బంధాన్ని కాదనడం హిందూ వివాహ చట్టం ప్రకారమే క్రూరత్వం కిందకు వస్తుందని, ఐపీసీ ప్రకారం కాదని తీర్పు చెప్పింది.