రైలు ప్రమాదం.. చావు నుంచి తప్పించుకున్నవారు ఏం చెప్పారంటే..

దేశ చరిత్రలో ఘోర రైలు ప్రమాదంగా అభివర్ణిస్తున్న ఒడిశా దుర్ఘటనలో ఇప్పటివరకు 388 మంది మరణించగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఒకేసారి.. ఒకే ప్రాంతంలో సెకన్ల వ్యవధిలో రెండు రైళ్లు ప్రమాదానికి గురి కావటం ఒక షాకింగ్ ఉదంతంగా చెప్పాలి. శుక్రవారం రాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో చావు ముంగిట వరకు వెళ్లి వచ్చిన ఒక కుటుంబం ఎలాంటి నష్టం జరగకుండా క్షేమంగా బయటపడింది. హావ్ డాకు చెందిన 50 ఏళ్ల జ్యోతిర్మయ హయతి గోపాలపూర్ సమీపంలోని గొళాబంధలోని ఆర్మీ కంటోన్మెంట్ లో సివిల్ ఉద్యోగిగా పని చేస్తున్నారు.

కుటుంబంతో కలిసి పదిహేను రోజుల సెలవు కోసం హావుడాకు వెళ్లిన ఆయన.. తిరిగి కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో తిరిగి విధుల్లో చేరేందుకు బ్రహ్మపురకు బయలుదేరారు. ప్రమాదానికి గురైన ఆయన తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబానికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన చెబుతూ..

“ఒక్కసారిగా రైలు భారీ కుదుపుతో ఆగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చుట్టూ చీకటి. చుట్టూ ఉన్న ప్రయాణికుల హాహాకారాలు. ఏం జరుగుతుందో తెలియని అయోమయం. తోటి ప్రయాణికులు ఏడ్చేస్తున్నారు. ఆ క్షణాల్ని జీవితంలో మర్చిపోలేం. భారీ కుదుపునకు గురైన వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోయింది. పై బెర్తులో ఉన్న నా భార్య కిందకు పడిపోయారు. చీకట్లో మా అమ్మాయి అద్రిజా కనిపించలేదు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను’ అని భయంకర అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

“మా ఆవిడ కనిపించింది. మా అమ్మాయి మాత్రం కనిపించలేదు. చీకట్లోనే బోగీలో అటు ఇటు తిరుగుతున్నా. పెద్దగా పేరు పెట్టి పిలుస్తున్నా. అయినా తను కనిపించలేదు. ఇదిగో మీ అమ్మాయి అంటూ చీకల్లో ఎవరో చెప్పారు. మా అమ్మాయి కనిపించింది. మేమందరం బాగున్నాం. పెద్దగా దెబ్బలు తగల్లేదు. బోగీ వెనుక వైపు వెళ్లి చూస్తే.. వెనుక ఉన్న బోగీలు కనిపించలేదు. బోగీలోని బాత్రూం సమీపంలోని ఎంట్రన్స్ డోర్ ధ్వంసమై ఉంది.

విరిగిన కిటికీలో నుంచి బయటకు చూస్తే.. చుట్టూ చీకటి. ఇంతలో ఎవరో టార్చిలైట్ వేశారు. ఆ వెలుతురులో పక్కనున్న పట్టాలపై బోల్తా కొట్టిన బోగీల్ని చూసి జరిగిన ఘోరం అర్థమైంది. నా భార్య.. కుమార్తెతో కలిసి జాగ్రత్తగా రైలు దిగాం. దేవుడి దయ.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ ఘోర ప్రమాదం నుంచి మా కుటుంబం తప్పించుకుంది. మేం క్షేమంగా బయటపడ్డా” అని ఆయన చెప్పారు.
తాము రైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని గంటల తర్వాత.. బస్సును ఏర్పాటు చేశారని.. దాంతో తమ ఇంటికి చేరుకున్నామని చెప్పారు. తమతో ప్రయాణించిన ప్రయాణికుల్లోకొందరు చనిపోయారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా చెప్పారు. జీవితంలో తాను ఎప్పుడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది లేదన్నారు.