రిటైర్మెంట్‌పై ధోని కొత్త ట్విస్ట్

ఈసారి ఐపీఎల్‌లో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం.. ధోని రిటైర్మెంటే. కప్పు ఎవరు గెలుస్తారనే దాని మీద కంటే ధోని ఈ సీజన్‌తోనే ఐపీఎల్ నుంచే కాక క్రికెట్ నుంచి మొత్తంగా తప్పుకుంటాడా లేదా అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది. 42వ పడికి చేరువ అవుతూ.. మోకాలి నొప్పితో బాధ పడుతున్న మహి.. ఇంకో సీజన్ ఆడే అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమయ్యాయి. అభిమానులు కూడా ఇదే అంచనాతో ధోని ఎక్కడ మ్యాచ్ ఆడినా స్టేడియాలకు పోటెత్తారు.

ఇదే తన చివరి సీజన్ అన్నట్లుగా చాలా ఉద్వేగంతో మ్యాచ్‌లు చూస్తూ ధోనీకి బ్రహ్మరథం పట్టారు. తాను కెరీర్ చివరి దశలో ఉన్నట్లు స్వయంగా ధోని చెప్పడంతో తన రిటైర్మెంట్‌పై అంతా ఒక అంచనాకు వచ్చేశారు. చివరగా చెన్నైకి మరో కప్పును అందించి ధోని రిటైరవుతాడని అంచనా వేశారు. అనుకున్నట్లే చెన్నై కప్పు గెలిచింది. మరి ధోని రిటైర్మెంట్ సంగతేంటి అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ధోని అండ్ టీం ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.

ఆ తర్వాత ధోని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడేమో అని చాలామంది ఆ సమయంలోనూ నిద్ర మేల్కొని ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ధోని అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే.. తాను ఇంకో సీజన్ కూడా ఆడటానికి ప్రయత్నిస్తానని ధోని ప్రెజెంటేషన్ టైంలో చెప్పాడు.

అభిమానులను ఉద్దేశించి ధోని మాట్లాడుతూ.. “నేను వాళ్లకు బహుమతి ఇవ్వాలి. ఇంకో సీజన్ ఆడటం అంటే చాలా కష్టమే. కానీ అందుకోసం ఏం చేయాలో అదంతా చేయడానికి ప్రయత్నిస్తా” అనడంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతానికి అయితే ధోని రిటైర్మెంట్ వాయిదా పడినట్లే. తన ఫిట్‌నెస్, వయసు ప్రభావం అన్నీ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐపీఎల్ సీజన్ ముంగిట నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకో సీజన్ ఆడగలను అనుకుంటే.. 2024లోనూ ఆడి రిటైరవుతాడు. లేదంటే అతడికి ఇదే చివరి సీజన్ కావచ్చు. చూద్దాం ఏమవుతుందో?