2000 నోట్లు ర‌ద్దు.. RBI సంచ‌ల‌న నిర్ణ‌యం

దేశంలో2016లో కొత్త‌గా వ‌చ్చిన 2000 రూపాయ‌ల‌నోట్ల‌ను రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ర‌ద్దు చేసింది. ఈ నోట్ల‌ను ఇక చెల్ల‌వ‌ని ప్ర‌క‌టించింది. వీటిని చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

లావాదేవీలకు గ‌డువు!

2000 నోటు ర‌ద్దు చేసినా.. సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవ‌చ్చని ఆర్బీఐ తెలిపింది. వినియోగదారులు త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000 నోట్ల‌న అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2 వేల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించి నట్టు ఆర్బీఐ వెల్లడించింది.  ఇదిలావుంటే,  రూ.2000 నోట్లు నవంబర్ 2016లో ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) కింద చెలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఈ నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది.  అయితే 2018-19 నుంచి ప్రింటింగ్ నిలిపివేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది.  మొత్తంగా తాజాగా తీసుకున్న నిర్ణ‌య మాత్రం సంచ‌ల‌నంగా నే మారింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు తీసుకున్న ఈ నిర్ణ‌యంవెనుక రాజ‌కీయాలు కార‌ణాలు ఉన్నాయా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.