ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ.. చితక్కొట్టేశాడుగా!

ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశ్వరూపం చూపించటంతో పరుగుల వరద పారింది. కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించటం ద్వారా సరికొత్త రికార్డును తన పేరుతో క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. యశ్ దాన్ని 13 బంతులకు కుదించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను భారీగా శిక్షించిన అతను బ్యాట్ తో వీర విహారం చేశాడు. మొత్తం 47 బంతుల్లో 13 ఫోర్లు.. 5 సిక్సులతో 97 పరుగులు సాధించిన అతని ఇన్నింగ్స్ చూసేందుకు రెండు కళ్లు చాలవు.

అయితే ఫోర్.. లేదంటే సిక్సు అన్నట్లుగా అతను బ్యాట్ తో చెలరేగిపోయాడు. అతను సాధించిన 97 పరుగుల్లో కేవలం 18 బంతులతో అతను సాధించిన పరుగులే 82 కావటం గమనార్హం. విధ్వంస బ్యాటింగ్ ఏ రీతిలో ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించిన అతడ్ని నిలువరించటం కోల్ కతా బౌలర్లకు సాధ్యం కాలేదు. మొదటి పదమూడు బంతుల్లో అర్థ శతకం సాధించిన అతను.. ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరు మీద మార్చేసుకున్నాడు. అంతకు ముందు ఈ రికార్డు (14 బంతుల్లో) 2018లో కేఎల్ రాహుల్ పేరు మీద.. 2022లో పాట్ కమిన్స్ పేరు మీదా ఉండేది.

150 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన యశ్ తొలి ఓవర్ నుంచే బంతిని బ్యాట్ తో శిక్షించటం షురూ చేశాడు. నితీశ్ రాణా వేసిన మొదటి ఓవర్ లో వరుస షాట్లతో 6,6,4,4,2,4లతో 26 పరుగులు సాధించి.. తన సందేశాన్ని ప్రత్యర్థి జట్టుకు బలంగా పంపారు. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్ లో చివరి రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీయటం ద్వారా ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్ మెన్ గా నిలిచారు. యశ్ విశ్వరూపంతో రాజస్థాన్ రాయల్స్ తనకున్న లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్ లో ఒక వికెట్ ను కోల్పోయి విజయాన్ని సాధించింది.