కృష్ణ..కృష్ణా చేసినవే చేస్తున్నావా.. జగనన్నా…

ప్రగతి ఖిలా కృష్ణా జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటుందంటారు. ఎన్టీయార్ స్వస్థలం కృష్ణా జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయభేరీ మోగించింది. ఈ లోపు కాలచక్రంలో నాలుగేళ్లు గడిచిపోయాయి. వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాన్ని తగ్గించుకునేందుకు జగన్ చేయని ప్రయత్నమూ లేదు..

కృష్ణా జిల్లాలో పట్టు పెంచుకునేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. మచిలీపట్నానికి పేర్ని నాని, గుడివాడకు కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ బుతుల నేతలుగా పేరు పొందిన వారిద్దరూ ఈ సారి ఎన్నికల్లో గెలవడం కష్టమని చెబుతున్న తరుణంలో జగన్ అక్కడ పర్యటించాలనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నెల 19న గుడివాడలో టిడ్కో ఇళ్లని లబ్దిదారులకు అందజేయనున్నారు. అలాగే గుడివాడ బస్టాండ్‌కు శంఖుస్థానప చేయనున్నారు. ఇక ఈ నెల 22న బందరు పోర్టు శంఖుస్థానపన చేయనున్నారు. ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపట్టడం మంచిదే అయినా అసలు సంగతి తెలుసుకున్న వాళ్లు మాత్రం నవ్వుకుంటున్నారు.

గుడివాడలో టిడ్కో ఇళ్ళు టి‌డి‌పి హయాంలో నిర్మించారు. 90 శాతం పనులు చంద్రబాబు పాలనలో జరిగాయి. ఇప్పుడు వాటికి రంగులు వేసి హడావుడి చేస్తున్నారని టీడీపి విమర్శిస్తోంది. ఇక బందరు పోర్టు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు. అంతకు మించి ఒక అడుగు ముందుకు పడటం లేదు. ఏదేమైనా చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మళ్లీ చేయడం జగనన్నకే చెల్లిందనుకోవాలి..