ఆర్సీబీ అసలు ఆట.. మీమ్స్ మోత

స్టార్ ఆటగాళ్లకు కొదవ ఉండదు. కాగితం మీద చూస్తే జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆ జట్టు ఆడుతుంటే స్టేడియాలు ఊగిపోతాయి. టీవీల ముందు కోట్ల మంది మద్దతుగా నిలుస్తారు. కానీ అంచనాలను అందుకోవడంలో ప్రతిసారీ చతికిలపడుతూ.. ఐపీఎల్ టైటిల్‌కు దూరం అవుతుంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒకప్పుడు టైటిల్ కోసం గట్టిగా పోటీ అయినా పడేది. కొన్నేళ్ల నుంచి ప్లేఆఫ్స్ చేరడం కూడా సవాలుగా మారుతోంది. ఎప్పట్లాగే ఈసారి కూడా ఆ జట్టు భారీ ఆశలు, అంచనాలతో బరిలోకి దిగింది.

తొలి మ్యాచ్‌లో కోహ్లి, ఫఫ్ డు ప్లెసిస్ చెలరేగి ఆడటంతో ముంబయి ఇండియన్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించింది ఆ జట్టు. అంతే.. ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఇక తమ జట్టుకు తిరుగులేదన్నట్లే వ్యవహరించారు.

కట్ చేస్తే ఒక్క మ్యాచ్ గడిచేసరికి మొత్తం కథ మారిపోయింది. గురువారం రాత్రి కోల్‌కతా చేతిలో ఏకంగా చిత్తుగా ఓడింది ఆర్సీబీ. 12వ ఓవర్లో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా జట్టుతో 204 పరుగులు చేయించడం ఆర్సీబీకే చెల్లింది. శార్దూల్ ఠాకూర్ అనే బౌలర్‌తో 29 బంతుల్లోనే 68 పరుగులు చేయించారు ఆ జట్టు బౌలర్లు. ఆ తర్వాత కోహ్లి సహా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో బెంగళూరు 123 పరుగులకే కుప్పకూలింది.

దీంతో ఆర్సీబీ మీద ఒక రేంజిలో ట్రోలింగ్ మొదలైంది. #vintageRCB సహా పలు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఆ జట్టు మీద మీమ్స్ మోత మోగించేస్తున్నారు నెటిజన్లు. ఈ సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ప్రెస్ మీట్లో ‘ఈ సాలా కప్ నమ్దే’ అని కెప్టెన్‌ డుప్లెసిస్‌తో అనిపించాలని చూస్తే.. అతనేమో ‘ఈ సాలా కప్ నహీ’ అన్నాడు. యాదృచ్ఛికంగా అన్నా అతను కరెక్టే అన్నాడని.. ఆర్సీబీ రాత ఎప్పటికీ మారదని అంటూ ఆ జట్టును ట్రోల్ చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఆర్సీబీ ట్రోల్ మీమ్స్‌తో ట్విట్టర్ షేక్ అయిపోయిందనే చెప్పాలి.