డ్రీమ్11 ఫౌండర్ సక్సెస్ స్టోరీ.. పోరాట సింహం!

డ్రీమ్ ఎలెవెన్.. ఈ రోజుల్లో ఈ పేరు తెలియని యూత్ ఉండరు. ఆ మాటకు వస్తే పెద్ద వాళ్లకు కూడా దీంతో బాగానే పరిచయం. క్రికెట్ సహా అనేక ఆటల్లో ఫాంటసీ లీగ్ ఆడేందుకు ఈ యాప్ ఒక వేదిక. ఇప్పుడు ఈ తరహాలో పదుల సంఖ్యలో యాప్స్ వచ్చాయి కానీ.. ముందు ఈ ఫాంటసీ లీగ్ పాపులర్ అయింది, ఎక్కువ ఆదరణ సంపాదించుకున్నది డ్రీమ్ ఎలెవెన్ ద్వారానే.

ఇప్పుడు ఎన్ని యాప్స్ ఉన్నప్పటికీ అన్నింట్లోకి డ్రీమ్ ఎలెవెనే టాప్. ఒక సీజన్లో ఐపీఎల్‌కు కూడా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది ఈ సంస్థ. ఇప్పుడు రోహిత్ శర్మ, ఆమిర్ ఖాన్, హార్దిక్ పాండ్య లాంటి ప్రముఖులు దీనికి ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టే డ్రీమ్ ఎలెవెన్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థను ఆరంభించిన హర్ష్ జైన్‌ది ఒక ఇన్‌స్పైరింగ్ సక్సెస్ స్టోరీ.

1986లో ముంబ‌యిలో పుట్టిన హ‌ర్ష్.. ఫిల‌డెల్ఫియాలో ఎక‌నామిక్స్ డిగ్రీ చేశాడు. చ‌దువుకునే రోజుల్లో ఆట‌ల మీద అమితాస‌క్తిని చూపించేవాడు. ఐపీఎల్ మొద‌లైన కొంత కాలానికి అత‌డికి ఫాంట‌సీ లీగ్ ఆలోచ‌న వ‌చ్చింది. ఐతే మూల‌ధ‌నం కోసం త‌న స్నేహితుడు భ‌విత్‌తో క‌లిసి ఎంతోమందిని క‌లిశాడు. 150 మంది పెట్టుబడిదారులను క‌లిసినా వాళ్లంద‌రూ వారి ఆలోచనను తిరస్కరించారట.

అయినా పట్టు వదలకుండా పోరాడి.. ఎలాగోలా పెట్టుబడి సంపాదించి డ్రీమ్ ఎలెవెన్ స్థాపించారట. కొత్త సంస్థను ప్రారంభిస్తున్నపుడు నమ్మి ముందుడుగు వేసే వాళ్లు తక్కువమంది అని.. నమ్మితే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడానికి ‘డ్రీమ్ ఎలెవన్’యే నిదర్శనం అని అంటున్నాడు హర్ష్. డ్రీమ్ ఎలెవెన్‌తో నెమ్మదిగా మొదలైన అతడి ప్రయాణం ఇప్పుడు వేల కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం డ్రీమ్ ఎలెవెన్ రూ.65 వేల కోట్ల సంస్థగా ఎదిగింది. ఈ సంస్థకు ప్రస్తుతం 150 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. భవిష్యత్తులో డ్రీమ్ ఎలెవెన్ ఇంకా పెద్ద సంస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. 2017లో హర్ష్.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడు అయ్యాడు. ప్రస్తుతం హర్ష్ అతడి కుటుంబం రూ.72 కోట్ల విలువైన లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటోంది.