కారులో వెళుతున్న ఐటీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు

దారుణం చోటు చేసుకుంది. కారులో వెళుతున్నఐటీ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు..కారును ఆపేసి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండటంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

కారులోఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి ఎవరన్నది గుర్తించటం కష్టంగా మారింది. దీనికి కారణం.. డెడ్ బాడీ గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయి ఉండటమే. అయితే.. కారు ఆధారంగా వివరాల్నిసేకరించారు పోలీసులు.

కారులో మరణించిన వ్యక్తి వెదురుకుప్పం మండలం బ్రామ్మణపల్లికి చెందిన ఐటీ ఇంజనీర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అతడు బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణ పల్లికి వెళుతున్నక్రమంలో అతడి హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత వెళుతున్న కారును ఆపిని దుండగులు.. కారు మీద.. నాగరాజు మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా భావిస్తున్నారు. అయితే.. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణ హత్య ఎందుకు జరిగిందన్న విషయం మీద ఫోకస్ చస్తున్నారు. మరణించిన నాగరాజుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యోదంతం స్థానికంగా సంచలనంగా మారింది.