కరోనా ప్రేమకథ.. సోషల్ మీడియాలో హల్‌చల్

కరోనా చుట్టూ ఎప్పుడై నెగెటివ్ న్యూసే చూస్తున్నాం. కానీ ఈ మహమ్మారి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాలుష్యం తగ్గడం.. మనుషుల మధ్య దూరం తగ్గి, బంధాలు బలపడటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ కోవలోనే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరి మనసులు కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటి కావడం విశేషం. ఇది జరిగింది మన తెలుగు గడ్డ మీదే కావడం విశేషం. దీనికి సంబంధిని వార్తా కథనాలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కరోనా ప్రేమకథ విశేషాలేంటో చూద్దాం పదండి.

ఆ అబ్బాయిది ప్రకాశం జిల్లా పర్చూరు.. అమ్మాయిది గుంటూరు జిల్లా చిలకలూరి పేట. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌. అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. వీళ్లిద్దరూ ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది.

ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. పక్క పక్క బెడ్లలో ఉండటంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో ఆసుపత్రిలో సరదాగానే గడిపారు. ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసింది. అభిరుచులు కలిశాయి.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఫోన్ నంబర్లతో పాటు మనసులు ఇచ్చి పుచ్చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో ఇరు వైపులా పెద్దలకూ పెళ్లి చేసేందుకు అభ్యంతరం లేకపోయింది.

ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఆలస్యం చేయకుండా.. హడావుడి లేకుండా ఇటీవలే పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారి పెళ్లి చేసేశారు. పరిచయం నుంచి పెళ్లి వరకు మొత్తం వ్యవహారం కేవలం నెల రోజుల లోపే అయిపోవడం విశేషం. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.