ఏపీ సీఎం నివాసానికి కూత వేటు దూరంలో అమానుషం!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసం అంటేనే.. అటో కిలో మీట‌రు.. ఇటో కిలో మీట‌రు.. వ‌ర‌కు భారీ ఎత్తున పోలీసుల భ‌ద్ర‌త ఉంటుంది. అంతేకాదు.. చీమ చిటుక్కుమ‌న్నా.. కూడా వెంట‌నే తెలిసిపోతుంది. మ‌రి అలాంటి అత్యంత భ‌ద్ర‌త ఉన్న సీఎం నివాసం ప్రాంతంలో ఓ వ్య‌క్తి గంజాయి మ‌త్తులో అతి కిరాత‌కానికి పాల్పడ్డాడు. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతని గంజాయి మత్తులో రాజు అనే యువ‌కుడు నరికి చంపాడు.

ఏం జ‌రిగిందంటే..

అంధురాలైన యువ‌తి ఇంట్లోనే ఉంటోంది. ఈవిష‌యాన్ని గ‌మ‌నించిన రాజు.. గంజాయి మ‌త్తులో సోమ‌వారం ఉద‌యం ఇంట్లోకి ప్ర‌వేశించి అత్యాచారానికి ప్ర‌య‌త్నించాడు. అయితే..యువ‌తి ప్ర‌తిఘ‌టించింది. దీంతో అప్ప‌టికి రాజు ప‌రార‌య్యాడు. అనంత‌రం.. యువ‌తి రాజు విష‌యాన్ని అమ్మకి, పెద్దమ్మకి తెలియజేసింది. దీంతో యువ‌తి త‌ల్లి, పెద్ద‌మ్మ‌లు ఇద్ద‌రూ.. కూడా రాజును వెతికి ప‌ట్టుకుని నిల‌దీశారు.

అయితే.. రాజు మాత్రం త‌న‌కు ఏ పాపం తెలీద‌ని, యువ‌తి త‌న‌ చెల్లితో స‌మాన‌మ‌ని న‌మ్మ‌బ‌లికాడు. దీంతో వారు వెళ్లిపోయారు. అయితే.. ఐదు నిమిషాల్లోనే ఫుల్లుగా గంజాయి కొట్టి విచక్షణ కోల్పోయిన స్థితిలో తిరిగి వ‌చ్చిన రాజు.. ఆ మత్తులో టెడ్డీబేర్ తో ఆడుకుంటున్న యువ‌తిని అతి దారుణంగా తలపై నరికి హ‌త్య‌చేశాడు. అనంత‌రం అక్క‌డ నుంచి పారిపోయాడు.

అయితే.. ఈ విష‌యం స్థానికంగానే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. రాజుకి పోలీసులతో ఉన్న స్నేహాల వల్ల ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నాడని యువ‌తి త‌ల్లి ఆరోపించింది. కళ్ళు కానరాని త‌న‌ కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన రాజును కఠినంగా శిక్షించాలని కోరింది. అయితే.. సీఎం ఇంటి స‌మీపంలోని యువ‌తుల‌కే ర‌క్ష‌ణ లేక‌పోవ‌డంపై విప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు.