పాజిటివ్ వస్తే.. జాబ్ కు ఎప్పుడు వెళ్లాలి? గైడ్ లైన్స్ ఏం చెబుతున్నాయి?

కరోనా పాజిటివ్ అన్న మాట ఇప్పుడు ఎవరి నోటి నుంచైనా వినిపించే వీలుంది. ప్రపంచం.. దేశం సంగతి తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఇప్పటికి తెలంగాణలో 45వేల మందికి వస్తే.. ఏపీలో 50వేల మందిని దాటేసింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు అధికారికంగా వెయ్యి మందికి పైనే రెండు రాష్ట్రాల్లో మరణిస్తే.. అనధికారికంగా చాలా ఎక్కువ మందే (రోగ లక్షణాలతోనూ.. నిర్దారణ కాకముందే) మరణించినట్లుగా చెబుతారు. అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా నేపథ్యంలో.. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎవరైనా ఒకరికి పాజిటివ్ వస్తే.. ఇప్పుడు మదిలో మెదిలే మొదటి అంశం.. ఎలా వైద్యం చేయించుకోవాలని. ప్రభుత్వం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. సర్కారీ దవాఖానాల వైపు చూసేవారే కనిపించరు. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల విషయానికి వస్తే.. లక్షలు చేతుల్లో ఉంటే తప్పితే.. చూసే దిక్కు లేదు. అది కూడా ఇన్స్యురెన్సు ఉందంటే ఒప్పుకోవట్లేదు. చేతిలో క్యాష్ పెడితే కానీ ఆడ్మిషన్ దొరకని పరిస్థితి. అది కూడా.. బోలెడన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే.

ఇదో సమస్య అయితే.. పాజిటివ్ అయ్యాక పనిలోకి వెళ్లటం ఎప్పటి నుంచి అన్నదో ప్రశ్న. ఎందుకంటే.. పాజిటివ్ వచ్చిందన్న వెంటనే దూరమయ్యే స్నేహితులు.. బంధుగణం అన్నింటికి మించి ఆఫీసులో అయితే.. ఎప్పుడూ లేనట్లుగా ‘మరేం ఫర్లేదు.. కాస్త రెస్టు తీసుకొని వద్దుర్లే’ అనే మాట వినిపిస్తోంది. దీంతో.. వారాల తరబడి ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. సంపన్నులు.. ఎగువ మధ్యతరగతి వారి పరిస్థితి ఫర్లేదు కానీ.. బడుగు జీవుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది.

ఇంతకీ పాజిటివ్ వచ్చిన వారిలో రోగ లక్షణాలు లేకుంటే ఎప్పటి నుంచి పనికి వెళ్లొచ్చు? అన్న విషయంపై రూల్ బుక్ ఏం చెబుతోంది? ఐసీఎంఆర్ ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చిందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఐసీఎంఆర్ చెబుతున్న దాని ప్రకారం పాజిటివ్ గా తేలి.. ఎలాంటి లక్షణాలు లేకుంటే పదిహేడు రోజుల తర్వాత విధుల్లోకి హాజరు కావొచ్చు. పదిహేడురోజులు దాటిన తర్వాత తిరిగి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఎలాంటి రోగ లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులు పది రోజుల ఐసోలేషన్ లో ఉండాలి. తర్వాత మరో ఏడు రోజుల పాటు జ్వరం.. దగ్గు.. జలుబు.. ఆయాసం లాంటి లక్షణాలు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తూ ఇంటి పట్టునే ఉండాలి. గడువు పూర్తి అయ్యాక ఎలాంటి లక్షణాలుకనిపించకుండే పదిహేడు రోజుల తర్వాత యథావిధిగా విధులకు హాజరు కావొచ్చని చెబుతున్నారు. ఈ విషయం మీద చాలామందికి అవగాహన లేక ఇబ్బందులకు గురవుతున్నారు.