కోహ్లి, రోహిత్, రాహుల్ కథ ముగిసినట్లేనా?

ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చింది భారత క్రికెట్ జట్టు. ఇంతలోనే మరో సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది. శ్రీలంకతో సొంతగడ్డపై జనవరి 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడబోతోంది టీమ్ ఇండియా. ఈ సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించారు. వన్డే జట్టు విషయంలో పెద్ద విశేషాలేమీ లేవు. అంచనాలకు తగ్గట్లే ఉంది. కానీ టీ20 జట్టు విషయంలో మాత్రం కీలక మార్పులు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే జట్టు ముఖచిత్రమే మారిపోయింది.

కోహ్లి తప్పుకున్నాక ఏడాది పాటు టీ20 జట్టు నడిపించిన Rohit sharmaమను మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్‌గా ప్రకటించారు. ఇదేమీ తాత్కాలికంగా ఈ సిరీస్ వరకు లాగా అనిపించడం లేదు. పూర్తి స్థాయిలోనే హార్దిక్‌ను టీ20లకు కెప్టెన్‌ను చేసినట్లు కనిపిస్తోంది.

రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌లోనే కాక దాని కంటే ముందు ఆసియా కప్‌లోనూ పేలవ ప్రదర్శన చేసింది భారత్. దీంతో అతడిపై వేటు వేయాలన్న డిమాండ్లు వినిపించాయి. మరోవైపు నిలకడగా ఆడలేకపోతున్న కోహ్లి, వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కేఎల్ రాహుల్‌లు కూడా జట్టుకు భారంగా మారుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ముగ్గురికీ వయసు కూడా పెరగడంతో ఇక టీ20ల నుంచి పక్కన పెట్టాలని, యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేయాలని సెలక్టర్లు ఫిక్సయినట్లున్నారు.

2007 ప్రపంచకప్‌కు ముందు సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి సీనియర్లు ఉన్నట్లుండి పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ టీ20ల్లో ఆడనే లేదు. ఇప్పుడు కూడా రోహిత్, Kohli, రాహుల్‌ల పరిస్థితి ఇలాగే మారేలా ఉంది. ఇక వాళ్లను మళ్లీ టీ20ల్లో చూడడం అనుమానమే కావచ్చు. ఆ ముగ్గురి ఫోకస్ ఈ ఏడాది ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్ మీదే ఉన్నట్లుంది. ఆ కప్పు ముగిశాక రోహిత్, కోహ్లి మొత్తంగా తమ అంతర్జాతీయ కెరీర్లను ముగించినా ఆశ్చర్యం లేదు.