నష్ట పరిహారం కోసం యూట్యూబ్ పై కేసు… 25 వేలు హుష్ కాకి

పిచ్చి పలు రకాలు అంటారు. అలాగే ఉంది మధ్యప్రదేశ్ కు చెందిన ఒక యువకుడి తంతు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఒక యువకుడు ఏకంగా దిగ్గజ ప్రపంచ వీడియో స్ట్రీమింగ్ కంపెనీ యూట్యూబ్ పైనే కేసు వేశాడు.

అసలు వారి ఇతనికి ఏమీ అన్యాయం చేశారు అని వివరాల్లోకి వెళితే… యూట్యూబ్ ఛానల్ లో వచ్చే కంటెంట్ వల్ల తను దృష్టి చదువుపై కేంద్రీకరించలేకపోయినట్లు ఆ పిటిషన్ వివరణ.

ఇక జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఏ ఎస్ ఓకా నేతృత్వంతో కూడిన బెంచ్ ఒక్కసారిగా ఈ అర్థం లేని వాదన విని ఆశ్చర్యపోయింది.

యూట్యూబ్ లోని యాడ్స్ లో ఉండే 18+ కంటెంట్ వలనే తన దృష్టి చదువుపై నుండి సడలినట్లు తెలిపి… అందుకు గాను గూగుల్ నుండి లక్షల రూపాయల నష్టపరిహారం కావాల్సిందిగా కోరాడు ఆ మేధావి యువకుడు.

ఇది విని ఆశ్చర్యపోయిన జడ్జీలు అతనికి నిండుగా చివాట్లు పెట్టేశారు. అసలు ఆ కంటెంట్ ను చూడకుండా ఉండవచ్చు అని… ఆ దిశగా అతను ఎందుకు ఆలోచించలేదని తిరిగి ప్రశ్నించారు.

అర్థంలేని వాదన తీసుకొచ్చి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు తిరిగి ఆ యువకుడే లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. ఇక నేను నిరుద్యోగిని బాబయ్యా అంటూ అవి అతను కోర్టును మొరపెట్టుకుంటే పాతికవేల రూపాయలతో అది కాస్తా తగ్గించి ఈ కేసుని ముగించారు.