ఫిఫా : సౌదీ జ‌ట్టు ఒక్కొక్క‌రికీ రోల్స్ రాయిస్ కార్లు

ఖతర్‌ వేదికగా దోహాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్ బాల్ పోటీల్లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనాను 2-1తో మట్టికరిపించి సౌదీ జట్టు సంచలనం సృష్టించింది. ఒక పెద్ద జట్టుపై సాధించిన విజయాన్ని ఆ దేశంలో పెద్ద సంబరంలా జరుపుకోవడమే కాదు ఒకరోజు అధికారిక సెలవుగా ప్రకటించడం విశేషం.

అర్జెంటీనా లాంటి పటిష్ట జట్టును ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 16 అవకాశాలను సులువుగా మార్చుకున్న సౌదీ అరేబియా ఫుట్‌బాల్‌ జట్టుకు మరో బంపరాఫర్‌ తగిలింది. అర్జెంటీనాపై గెలిచినందుకు జట్టులోని ఒక్కో ఆటగాడికి ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు రోల్స్‌ రాయిస్‌ సంస్థ పేర్కొంది. అర్జెంటీనాపై గెలిస్తే ఆటగాళ్ళకు రోల్స్‌ రాయిస్‌ కారును గిప్ట్‌గా ఇస్తానని సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాట ఇచ్చారు.

ఆయన తన మాట నిలబెట్టుకుంటూ ఆటగాళ్లందరికి రోల్స్‌ రాయిస్‌ కారును బహుమతిగా అందజేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక, రోల్స్‌ రాయిస్‌ ఒక్క కారు ఖరీదు 500,000 యూరోలు(భార‌త‌ కరెన్సీలో రూ.4 కోట్లకు పై మాటే). అయితే సౌదీ అరేబియా ఫుట్‌బాల్‌ జట్టుకు ఇలాంటి గిఫ్ట్‌లు రావడం ఇదేమి కొత్త కాదు. ఇంతకముందు 1994 వరల్డ్‌కప్‌లో బెల్జియంను 1-0తో ఓడించినప్పుడు.. అప్పటి మ్యాచ్‌లో గోల్‌తో జట్టును గెలిపించిన సయీద్‌ అల్‌ ఒవైరన్‌కు లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు.

ఇక ఇప్పటి మ్యాచ్‌లో సౌదీ అరేబియా తొలుత 0-1తో వెనుకబడింది. అయితే రెండో అర్థభాగంలో అనూహ్యంగా ఫుంజుకున్న సౌదీ అరేబియా వరుసగా రెండు గోల్స్‌ కొట్టి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతేకాదు 36 మ్యాచ్‌ల్లో ఓటమి అనేదే లేకుండా సాగిన అర్జెంటీనాకు చెక్‌ పెట్టింది. ఇక, తాజాగా లెవాండోస్కీ నేతృత్వంలోని పటిష్టమైన పొలాండ్‌ను సౌదీ అరేబియా ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో గనుక సౌదీ అరేబియా గెలిస్తే రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధిస్తుంది.