హైదరాబాద్ లో ఎయిరోప్లేన్ రెస్టారెంట్..

పుర్రెకో బుద్ధి…జిహ్వకో రుచి అన్నారు పెద్దలు…ఈ సోషల్ మీడియా జమానాలో వినూత్నమైన ఆలోచనలను జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే, చాలామంది తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు సరికొత్త కాన్సెప్ట్ లతో కస్టమర్ల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్, హోటల్స్ వంటి బిజినెస్ లలో వెరైటీ కాన్సెప్ట్ లు పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రుచికరమైన ఐటమ్స్, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే చాలు అన్నది గతంలో మాట.

మారుతున్న ట్రెండ్ ప్రకారం పైన చెప్పిన వాటితో పాటు ఆ హోటల్ లేదా రెస్టారెంట్ లో ఇంటీరియర్ డిజైనింగ్, అక్కడి థీం వంటి విషయాలు కూడా ఆ హోటల్ బిజినెస్ పై ప్రభావం చూపే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా రెస్టారెంట్లు, హోటళ్లు, కాఫీ షాపుల ఓనర్లు వినూత్నమైన థీమ్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ హోటల్ యజమాని బుర్రలో పుట్టిన ఆలోచన ఎంతోమంది కస్టమర్ల జిహ్వకు రుచిని అందించనుంది.

హైదరాబాదులోని పిస్తా హౌస్ హోటల్ యజమాని తాజాగా ఏరోప్లేన్ హోటల్ ను ప్రారంభించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. కేరళలో జరిగిన ఒక ఆక్షన్ లో ఒక పాత విమానాన్ని పిస్తా హౌజ్ యజమాని కొనుగోలు చేశారు. దానిని, హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ తో పాటు రెస్టారెంట్ కు అనుగుణంగా మార్పులుచేర్పులు చేశారు. ఈ క్రమంలోనే ఏరోప్లేన్ రెస్టారెంట్ ను సందర్శించేందుకు జనం క్యూ కడుతున్నారు.

అయితే హైదరాబాద్ కు ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపించొచ్చు కానీ ఈ తరహా ఏరోప్లేన్ రెస్టారెంట్ విజయవాడ సమీపంలోని గన్నవరం ప్రాంతంలో ఆల్రెడీ చాలా కాలం నుంచి ఉంది. విజయవాడ-ఏలూరు హైవేపై గన్నవరం సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ విజయవాడ పరిసర ప్రాంతవాసులకు సుపరిచితమే. ఏదేమైనా హైదరాబాద్ పిస్తా హౌస్ ఏరోప్లేన్ రెస్టారెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.