మా ఆవిడ చిత‌క్కొట్టేస్తోంది.. ఏం చేయ‌ను స‌ర్‌..

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీకి నిత్యం దేశ ప్ర‌జ‌ల నుంచి అనేక సందేశాలు వెళ్తుంటాయి. ఇటు మెయిళ్లు.. అటు ట్విట్ట‌ర్ మెసేజుల‌తో పీఎం కార్యాల‌యం పెద్ద పోస్టాఫీసుగా మారిపోయింది. ప్ర‌ధాని కూడా ఇలాంటి సందేశాల్లో బాగున్న‌వాటిని ఎంచుకుని సంద‌ర్భాను సారం వాటిని ప్ర‌స్తావిస్తారు కూడా. ఇలా.. తాజాగా ఒక వ్య‌క్తి చేసిన ట్వీట్‌.. పీఎం మోడీకి షాకిచ్చింది. దీనిని చ‌దివిన త‌ర్వాత పీఎంవో అధికారులు.. `మోడీస‌ర్‌కి ఇలాంటోడు ఇప్ప‌టి వ‌రుకు ఎదురు ప‌డి ఉండ‌డు“ అని త‌మ‌లో తామే న‌వ్వుకుంటున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. త‌న భార్య త‌న‌ను చిత‌క్కొట్టేస్తోంద‌ని పేర్కొంటూ క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ వ్యక్తి.. పీఎంఓకు ట్వీట్ చేశారు. దీని పై మోడీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియ‌దు కానీ, అనేక మంది నెటిజన్లు మాత్రం ఈ భార్యా బాధితుడికి మద్దతు తెలిపారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సైతం స్పందించారు. కేసు పెడ‌దాం.. వ‌చ్చేయ్‌! అని పిలుపునిచ్చారు. ఆద్యంతం ఆస‌క్తిగా ఉన్న ఈ విష‌యం ఏంటో తెలుసుకుందామా?

భర్త కొడుతున్నాడని భార్య ఫిర్యాదు చేయడం చాలాసార్లు చూసుంటాం. కానీ కర్ణాటకలో మాత్రం సీన్ రివర్స్. భార్య తనను వేధిస్తోందని, కొన్ని కొన్ని సార్లు చిత‌క్కొట్టేస్తోంద‌ని బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య వాపోయాడు. అంతే కాదు, ఆమె వల్ల తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె తనను కత్తితో గాయపరించిందని ఆరోపించాడు.

నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదా ఏదైనా జరిగినప్పుడు చూస్తూ కూర్చుంటారా? ఎందుకంటే నేను మగవాడిని! నా భార్య నా పై కత్తితో దాడి చేసింది. మీరు అంటున్న నారీ శక్తి ఇదేనా? దీని కోసం నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదు కదా!” అని ట్విట్టర్లో యదునందన్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్కు స్పందించారు బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మ‌రోవైపు ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. ఆయ‌న‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుంటే, మ‌రి పీఎం మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.