టిక్‌టాక్‌కి యాంటీ డోస్.. ఇన్‌స్టాగ్రామ్‌లో

ఇండియాలో అత్యధిక మంది ఉపయోగించే ‘టిక్ టాక్’ యాప్‌పై నిషేధం పడింది. దీంతో టిక్ టాక్ లవర్స్ అందరూ కిందా మీదా అయిపోతున్నారు. వాళ్లంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీని తాలూకు బాధ నుంచి కోలుకుని ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు చూస్తున్నారు. రొపోసో, చింగారి, గోసోషల్ సహా కొన్ని యాప్‌లు టిక్ టాక్ తరహా వినోదాన్ని, ఆప్షన్లను అందిస్తున్నాయి.

కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను కూడా ‘టిక్ టాక్’ స్టయిల్లోకి మార్చే, ఆప్షన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఇన్‌స్టాగ్రామ్‌ చేరింది. ఇన్‌స్టాగ్రామ్‌‌లో కొత్తగా ‘రీల్స్‌’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇండియాలో బుధవారం రాత్రి నుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. టిక్‌టాక్‌ తరహాలోనే ఇందులో కూడా 15 సెకన్ల నిడివితో వివిధ రకాలైన నేపథ్య సంగీతం, ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ టూల్స్‌ వినియోగించుకుని వీడియోలను రూపొందించవచ్చు.

అర్జున్‌ కనుగో, జాహ్నవి దాసెట్టి (మహాతల్లి), ఇంద్రాణీ బిశ్వాస్ (వండర్‌మున్నా), ఆర్‌జే అభినవ్‌ లాంటి కంటెంట్ క్రియేటర్లు.. రీల్స్ ద్వారా కొత్త వీడియోల రూపకల్పనలో బిజీ అయిపోయారు. రీల్స్‌లో పేరు తెచ్చుకున్న క్రియేటర్లు, మోడల్స్‌ డబ్బులు సంపాదించుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మూడోవంతు వినియోగదారులు వీడియోలనే పోస్ట్‌ చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ‘రీల్స్’ను అందుబాటులోకి తెచ్చామని.. ఇప్పటికే బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో విజయవంతమైన ‘రీల్స్’ను భారత్‌లోకి కూడా ప్రవేశపెట్టామని ‌ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. టిక్ టాక్‌లో వీడియోలు చేయడానికి, చూడటానికి బాగా అలవాటు పడ్డ వాళ్లందరూ గత రెండు వారాల్లో రొపోసో, చింగారి, గో సోషల్ లాంటి యాప్‌లను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రంగంలోకి దిగింది. మరిన్ని కొత్త యాప్‌లు, ఫ్లాట్ ఫామ్స్ ‘టిక్ టాక్’ లోటును భర్తీ చేసే ప్రయత్నంలో ఉండటంతో నెమ్మదిగా జనాలు ‘టిక్ టాక్’ను మరిచిపోయేలాగే ఉన్నారు.