భారత అమ్మాయిలు చేసింది రైటా రాంగా?

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్లో ఒక సిరీస్ గెలవడమే కాదు.. క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచుల సిరీస్ ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న భారత అమ్మాయిలు.. చివరి వన్డేలోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. భారత లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామికి ఇదే చివరి సిరీస్ కావడం.. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు ఆమె తెరదించడంతో గొప్ప విజయంతో ఆమెకు ఘనమైన వీడ్కోలు పలికారు సహచర క్రీడారిణులు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. చివరి మ్యాచ్ ను భారత్ ముగించిన తీరు మాత్రం వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 45.4 ఓవర్లలో169 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. 118 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.

దీంతో భారత్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ ఫ్రెయా డేవీస్ (10 నాటౌట్)తో కలిసి చార్లీ డీన్ (47) గొప్పగా పోరాడింది. ఒక వికెట్ చేతిలో ఉండగా 40 బంతుల్లో 17 పరుగులే చేయాల్సి రావడంతో ఇంగ్లాండ్ విజయానికి చేరువైనట్లే కనిపించింది. ఈ స్థితిలో బౌలింగ్ చేస్తున్న దీప్తి శర్మ.. తాను బంతి వేయడానికి ముందే డీన్ క్రీజు నుంచి ముందుకు కదలడంతో రనౌట్ చేసింది. దీన్ని మన్కడింగ్ అంటారన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఇలా రనౌట్ చేయడం కరెక్టే అయినా.. దాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తారు. ఐపీఎల్ లో ఇంగ్లాండ్ ఆటగాడు బట్లర్ ను ఇలా రనౌట్ చేసినందుకు అశ్విన్ ఎంతగా విమర్శల పాలయ్యాడో తెలిసిందే.

ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని ఒక వర్గం వాదిస్తే.. బ్యాట్స్ మన్ ఇలా ముందే క్రీజును వదిలి అదనపు ప్రయోజనం పొందుతున్నపుడు రనౌట్ చేయడంలో తప్పేంటి అనే మరో వర్గం ప్రశ్నిస్తూ ఉంటుంది. దీప్తి చేసిన రనౌట్ తో మరోసారి దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మామూలు స్థితిలో దీప్తి రనౌట్ చేస్తే ఇంత వివాదం అయ్యేది కాదు కానీ.. వికెట్ పడక, మ్యాచ్ చేజారుతున్న స్థితిలో దీప్తి అలా రనౌట్ చేయడం, క్రీడా స్ఫూర్తితో ఆ రనౌట్ ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇండియన్ టీం అలా చేయకుండా గెలుపు సంబరాలు చేసుకోవడాన్ని సొంత అభిమానులే తప్పుబడుతున్నారు. రనౌటయ్యాక డీన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇంగ్గాండ్ పట్ల సానుభూతికి కారణమవుతోంది. కానీ కొందరు మాత్రం నిబంధనల ప్రకారమే రనౌట్ చేసినపుడు ఇందులో వివాదమేముంది అని ప్రశ్నిస్తున్నారు.