భార్య‌-భ‌ర్త‌-ఒక ప్రేమికురాలు

ఔను! మీరు చ‌దివింది నిజ‌మే.. ఒక భార్య‌-ఒక భ‌ర్త‌.. మ‌రో ప్రేమికురాలు.. ఈ ముగ్గురు ఒక్క‌ట‌య్యారు. ఒక‌పై.. ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్ట‌నున్నారు. ఇది చిత్ర‌మైన విష‌యం అనుకుంటున్నారా? ఇదెక్క‌డో.. విదేశాల్లో జ‌రిగింద‌ని భావిస్తున్నారా? అదేమీకాదు.. ఇది మ‌న ఏపీలోనే.. మ‌న తిరుప‌తి జిల్లాలోనే జ‌రిగింది. ప్ర‌స్తుతం.. ఈ ఘ‌ట‌న‌.. ఆస‌క్తిగాను.. చ‌ర్చ‌నీయాంశంగానూ ఉండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే..

కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాను ఊపేసిన టిక్‌టాక్‌లో ఓ ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇది కాస్తా.. ప్రేమగా మారింది. ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నారు. అయితే.. ఇంతలోనే.. హ‌ఠాత్తుగా..కేంద్ర ప్ర‌భుత్వం.. రాత్రికి రాత్రి టిక్‌టాక్‌ను నిలిపివేసింది. దీంతో ఇద్ద‌రు ప్రేమ జంట దూర‌మై పోయారు. ఈ క్ర‌మంలో అబ్బాయి.. త‌న మానాన తాను ఉన్నా.. ప్రేమికు రాలు మాత్రం స‌ద‌రు ప్రేమికుడిని వ‌దిలి పెట్ట‌లేదు. ప‌ట్టుబ‌ట్టి.. మ‌రీ సాధించింది. అయితే.. ఇక్క‌డే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమికురాలు.. ప్రేమికుడిని క‌నిపెట్టి.. ద‌రిచేరే స‌రికి.. అత‌నికి అప్ప‌టికే వివాహం అయిపోయింది.

సాధార‌ణంగా అయితే.. ఏం జ‌రుగుతుంది.. ఏ ఆత్మ‌హ‌త్యో.. పోలీసుల‌కు ఫిర్యాదో.. లేక‌.. పెళ్లయిన ప్రేమికుడిపై కేసులు పెట్ట‌డ‌మో.. లేదా.. కుటుంబంలో వివాదాలు రేప‌డ‌మో.. క‌దా!! కానీ.. ప్రేమికురాలు.. ఒక్క ప్రేమనేకాదు.. తెలివిని కూడా పంచింది. త‌న ప్రేమికుడి.. భార్య‌నుసైతం ఒప్పించి.. రెండో భార్య‌గా సెటిల్ అయిపోయింది. ఆద్యంతం అనేక ట్విస్టులు ఉన్న ఈ వ్య‌వ‌హారం.. అంద‌రికీ ఆస‌క్తిగా మారింది.

తిరుప‌తి జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్‌టాక్‌లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు.. ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది.

కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు.. తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదీ.. సంగ‌తి..!!