ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2గా అదానీ

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుజరాత్ కు చెందిన ఈ బడా వ్యాపారవేత్త తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా అదానీ సంపద విలువ భారీగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో రెండో స్థానంలో నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

తాజాగా ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ ఇండెక్స్ లో అదానీ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. ఫ్రాన్స్ కు చెందిన బర్నాల్డ్ ఆర్నాల్డ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక, మన దేశానికి చెందిన మరో కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ ఇండెక్స్ లో రెండోస్థానంలో నిలిచిన తొలి భారతీయుడిగా, ఆసియా ఖండానికి చెందిన తొలి వ్యక్తిగా అదానీ చరిత్ర పుటలకెక్కాడు. అదానీ కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరగడంతో ఆయన సంపద 155.7 బిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఇక, 92.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ఆ జాబితాలో 8 స్థానంలో నిలిచారు.

స్టాక్ మార్కెట్లలో షేర్ల విలువలో హెచ్చు తగ్గులకు అనుగుణంగా ప్రపంచ కుబేరుల సంపద పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఈ వివరాలను ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ ఇండెక్స్ వెల్లడిస్తూ ఉంటుంది.