అణు యుద్ధం.. ఎంతమంది చనిపోతారో తెలుసా?

ప్రపంచం వినాశపు అంచుల్లో ఉందని ఇప్పటికే హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే దాని పర్యవసానం ఎలాగుంటుందో చాలా సినిమాల్లో చూపించారు. ఇదే విషయమై అమెరికాలోని వ్యవసాయరంగంలోని శాస్త్రజ్ఞులు కూడా అంచనా వేశారు. అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే ప్రపంచంలోని సుమారు 500 కోట్ల మంది జనాలు చనిపోతారంటు తమ నివేదికలో స్పష్టంగా ప్రకటించారు.

ఒక అంచనా ప్రకారం ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు. అణుయుద్ధం జరిగితే ఇందులో సుమారు 500 కోట్లమంది చనిపోతారంటే అణ్వాయుధాల తీవ్రత ఏ స్ధాయిలో ఉంటుందో అందరికీ అర్ధమవుతోంది. ఇంతకీ ఇన్నివందల కోట్ల మంది జనాలు ఎలా చనిపోతారు ? అణ్వాయుధాల తీవ్రత వల్లనా లేకపోతే ఇంకేదైనా కారణమా ? అంటే రెండూ అని శాస్త్రజ్ఞులు చెప్పారు.

మొదటి కారణం ఏమిటంటే అణ్వాయుధాల ప్రయోగం వల్ల ముఖ్యంగా వాతావరణంలో ఎవరు ఊహించని పరిణామాలు జరుగుతాయట. దీనివల్ల పంటలు పూర్తగా నాశనమైపోతాయట. అంటే భూసారం దెబ్బతినేస్తుంది. నీళ్ళంతా కాలుష్యమైపోయి విషపూరితమైపోతుంది. అలాగే వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు బాగా పెరిగిపోతాయట. దీనివల్ల జనాలకు అనేక రకాల శ్వాస సంబంధిత రోగాలు ఒక్కసారిగా పెరిగిపోతాయట. అంటే ఇటు అనారోగ్యాలు పెరిగిపోయి అటు పంటలూ పండకపోతే జనాలంతా ఏమై పోతారు ? దీనికి ఉదాహరణగా భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఐదేళ్లలోపు పంటలన్నీ దెబ్బ తినేస్తాయని అంచనా వేశారు. దీనివల్ల 7 శాతం వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతాయట.

అంటే మామూలు పద్దతుల్లో జరిగే యుద్ధం వల్లే 7 శాతం పంటలు దెబ్బతినేస్తే ఇక అణ్వాయుధాల కారణంగా ఇంకెత నష్టం జరగుతుంది ? అమెరికా-రష్యా మధ్య అణ్వాయుధాలతో యుద్ధం జరిగితే ప్రపంచంలో 90 శాతం పంటలు దెబ్బతినేస్తాయట. అప్పుడు ఆహారాన్ని వృధా చేయడం తగ్గించేస్తే, జంతువుల నుండి లభించే ఆహారంమాత్రమే తాత్కాలికంగా ఆహార ఉత్పత్తి కొరతను తీరుస్తుందట. కొంతకాలమైన తర్వాత ఇవికూడా దొరకవన్నది వాస్తవం.