చైనాలో అలీబాబా ఆగమాగం.. షాకింగ్ నిర్ణయం

చైనా ప్రభుత్వంతో పెట్టుకొని బతికి బట్టకట్టటం అంత తేలికైన విషయం కాదు. చైనా ఈ-కామర్స్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే అలీబాబాకు కొంత కాలం క్రితం నుంచి బ్యాడ్ టైం షురూ కావటం తెలిసిందే. ప్రభుత్వం కన్నెర్ర చేసిన నేపథ్యంలో అలీబాబా అధినేత జాక్ మాకు కొత్త కష్టాలు పిడుగుల మాదిరి ఒకటి తర్వాత ఒకటి చొప్పున పడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన కంపెనీ మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి.. మరోవైపు అమ్మకాలు తగ్గిపోవటం.. భారీ నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జాక్ మా.. చివరకు తన సంస్థలో పని చేసే పది వేల మంది ఉద్యోగాలకు చెల్లుచీటి ఇచ్చేసిన వైనం సంచలనంగా మారింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థకు మార్కెట్ లో తీవ్రమైన ఆంక్షలు చైనా ప్రభుత్వం నుంచి రావటంతో జాక్ మాకు తిప్పలు తప్పటం లేదు. అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ లో భాగంగా తాజా చర్యకు కారణమైందంటున్నారు. తమ సంస్థకు చెందిన 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సమాచారాన్ని అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వెల్లడించింది.

జూన్ తో ముగిసే త్రైమాసికంలో 9241 మందికి పైనే ఉద్యోగుల్ని తొలగించగా.. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,45,700లకు తగ్గినట్లుగా చెబుతున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం సంస్థకు చెందిన పలువురు ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కాస్తంత ఊరడింపు అంశం ఏమంటే.. తమ సంస్థలో ఆరు వేల మంది ఫ్రెష్ వర్సిటీ గ్రాడ్యుయేట్స్ ను పనిలోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గ్రూపునకు లాభాల్లో కూడా భారీ కోత పడినట్లుగా కంపెనీ చెబుతోంది.