దేశంలో పెరిగిపోతున్న ఫోర్త్ వేవ్ ఆందోళన

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని క్షేత్ర స్ధాయిలోని పరిణామాలు చూస్తుంటే కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ ఆందోళన పెరిగిపోతోంది. దేశం మొత్తం మీద శనివారం 3962 కేసులు నమోదైతే, ఆదివారం నాడు 4270 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదవ్వటమే కాకుండా 15 మంది చనిపోయారు. మార్చి 11వ తేదీ తర్వాత ఇన్ని వేల కేసులు నమోదవ్వటం మళ్ళీ ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, దేశ రాజధాని అయిన ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.

పై రాష్ట్రాలతో పాటు కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అందుకనే కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకించి అలర్ట్ ప్రకటించారు. పై రాష్ట్రాల్లో జనాలందరు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో నమోదైన మొత్తం 4270 కేసుల్లో 1357 కేసులు మహారాష్ట్రలో మాత్రమే నమోదవ్వడం ఆ తీవ్రతకు ఉదాహరణగా మారింది. మొదటి నుంచి మహారాష్ట్ర ప్రత్యేకించి ముంబైలోనే కరోనా వైరస్ కేసులు మొదటి నుంచి విపరీతంగా నమోదవుతున్నాయి.

ముంబైలోని ధారవి స్లమ్ కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నాయి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ (స్లమ్) ధారావీయే. ఇందులో సుమారు 20 లక్షల మంది నివాసముంటున్నారు. కాబట్టి ఏ అంటు వ్యాధి సోకినా రోజుల వ్యవధిలో మొత్తం స్లమ్ అంతా పాకిపోతుంది. ఇందుకనే ముంబైలో కేసులు మొదటి నుండి చాలా ఎక్కువగా నమోదవుతోందనే ప్రచారముంది.

ఫోర్త్ వేవ్ జూన్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 24 మధ్య పోర్త్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించటం, ప్రతి ఒక్కళ్ళు మాస్కు ధరించటమే ఏకైక మార్గమని నిపుణులు జనాలను హెచ్చరిస్తున్నారు. ఇపుడు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల్లో కొత్త వేరియంట్లలో జాడ కనిపించటం లేదని శాస్త్రజ్ఞులు ప్రకటించటం కాస్త ఊరట కలిగించేదే. కాకపోతే పాత వేరియంట్లే తీవ్ర స్ధాయిలో విజృంభిస్తే మాత్రం నష్టాలు భారీగా ఉంటాయని అంటున్నారు.