ఇండియాలో అనుతించిన కరోనా మెడిసిన్స్ ఇవే

కరోనాను పూర్తిగా నివారించే మందు ఇంకా ఎక్కడా కనిపెట్టలేదు. కరోనాకు మందొచ్చేసిందంటూ ఎప్పటికప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ ఓ మోస్తరుగా వైరస్‌ను తగ్గించేవే తప్ప.. మొత్తంగా వైరస్‌ను పారదోలేవి కావు. గ్లెన్ మార్క్ సంస్థ ఇటీవలే విడుదల చేసిన ‘ఫాబి ఫ్లూ’ సైతం ఇలాంటిదే. కరోనా తక్కువగా, మధ్యస్థంగా ఉన్న రోగులు ఈ మందు వాడితే కోలుకుంటారు. ఐతే ‘ఫాబి ఫ్లూ’తో పాటు మరికొన్ని మందుల గురించి కూడా ఈ మధ్య కాలంలో పెద్ద చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో అసలు ఇండియాలో కరోనా చికిత్సలో భాగంగా మందులేంటి అన్నది ఒకసారి చూద్దాం.

కరోనాకు ఆరంభం నుంచి వాడుతున్న మందు రెండెసివిర్ (Remdesivir). అమెరికాకు చెందిన గిలియాడ్‌ సైన్సెస్‌ తొలుత దీన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక యాంటీ వైరల్‌ డ్రగ్‌. దీన్ని గతంలో ఎబోలా చికిత్సకు ఉపయోగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కోవిడ్‌ 19 ఎమర్జెన్సీ పేషెంట్లకు వాడవచ్చని సూచించింది. అలాగే మే 1వ తేదీన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (USFDA) కూడా ఈ మెడిసిన్‌ ఉపయోగానికి ఆమోద ముద్ర వేసింది. దీన్ని మన దేశంలోనూ ప్రస్తుతం కోవిడ్‌ మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు, ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్స కోసం వాడుతున్నారు. హెటిరో గ్రూప్‌ ఈ మెడిసిన్‌ను కోవిఫోర్‌ (Covifor) పేరిట ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ఇంజెక్షన్‌ 100 మిల్లీగ్రాముల డోసులో ఉంటుంది. ఒక్క డోసు ధర రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఉంది.

ఫావిపిరవిర్‌ (Favipiravir) అనే మరో మందును కూడా ఇండియాలో వాడుతున్నారు. జపాన్‌కు చెందిన ఫ్యుజిఫిలిం టోయామా కెమికల్‌ లిమిటెడ్‌ తొలుత దీన్ని తయారు చేసింది. ఇది ఒక యాంటీ ఇన్‌ఫ్లుయెంజా డ్రగ్‌. ఈ మెడిసిన్‌ శరీరంలో వైరస్‌ కణాలు వృద్ధి చెందకుండా చూస్తుంది. కోవిడ్‌ 19 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్‌ 88 శాతం వరకు సత్ఫలితాలను ఇచ్చింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఈ మెడిసిన్‌ను వాడుతున్నారు.

భారత్‌లో గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ఈ మందునే ఫాబిఫ్లూ (FabiFlu) పేరిట విక్రయిస్తోంది. ఒక్కో ఫాబిఫ్లూ ట్యాబ్లెట్‌ను రూ.103కు విక్రయిస్తున్నారు.
డెక్సామిథసోన్‌ (Dexamethasone) అనే మరో మందు కోవిడ్‌ 19 పేషెంట్లు మృతి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. వారి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కోవిడ్‌పై మరింత మెరుగ్గా పోరాడేందుకు ఈ మెడిసిన్‌ ఉపయోగపడతుంది. దీన్ని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ 19 పేషెంట్లకు ఇస్తున్నారు. యూకేలో ఈ డ్రగ్‌ను కోవిడ్‌ పేషెంట్లకు వాడేందుకు ముందుగా అనుమతి ఇచ్చారు. ఈ స్టెరాయిడ్‌ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. భారత్‌లో దీని ఇంజెక్షన్‌ ఖరీదు రూ.10 కన్నా తక్కువగానే ఉంది.

ఇక కరోనా సమయంలో ఎక్కువగా చర్చనీయాంశమైన మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (Hydroxychloroquine). భారత్‌లో ముందు నుంచి దీన్ని మలేరియా చికిత్సకు వాడుతున్నారు. ఇది యాంటీ రుమాటిక్‌ డ్రగ్‌గా కూడా పనిచేస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. ఈ డ్రగ్‌ కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా చూస్తుందని తేలింది. దీంతో కోవిడ్‌ చికిత్సకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 12 ఫార్మా కంపెనీలు ఈ మెడిసిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ మెడిసిన్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ఖరీదు రూ.3గా ఉంది. అమెరికా సహా కొన్ని దేశాలకు ఈ మందును ఎగుమతి చేసింది ప్రభుత్వం.