మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతాల్లో కోతలా ?

బస్సుల మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతాల నుంచి రికవరీ చేయబోతున్నారా ? అనకాపల్లి బస్ డిపో అధికారుల ఓవర్ యాక్షన్ తో ఈ విషయం బయటపడింది. విశాఖపట్నం నగర పరిధిలో సింహాచలం, అనకాపల్లి డిపోల్లో పనిచేస్తున్న కొందరు డ్రైవర్లకు సంబంధిత డిపో అధికారుల నుండి నోటీసులు అందాయి. మైలేజీ తగ్గింది కాబట్టి డీజల్ కు అయిన అదనపు ఖర్చులను మీ జీతాల్లో నుంచి ఎందుకు రికవరీ చేయకూడదో చెప్పాలంటు అధికారులకు కొందరు డ్రైవర్లకు నోటీసులు ఇచ్చారు.

మొన్నటి ఏప్రిల్లో ఒక డ్రైవర్ నడిపిన బస్సు మైలేజీ లీటర్ డీజల్ కు 6 కిలోమీటర్లు రావాల్సుంది. అయితే అధికారులు లెక్కలు కట్టిన తర్వాత 5.10 కిలోమీటర్లే వచ్చిందని తేలింది. మైలేజీ తగ్గడం వల్ల సదరు బస్సుకు అదనంగా 115 లీటర్ల డీజల్ వాడాల్సొచ్చిందట. అంటే దీని ఖరీదు రు. 12,075 ను సదరు డ్రైవర్ జీతం నుండి ఎందుకు రికవరీ చేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. అలాగే మరో డ్రైవర్ కు 5.20 కిలోమీటర్లకు బదులు 4.65 కిలోమీటర్ల మైలేజీయే వచ్చింది. 76 లీటర్ల డీజల్ అదనపు వాడకానికి అయిన రు. 7980 రికవరీకి నోటీసులు అందాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే బస్సుల మైలేజీ తగ్గిందంటే అనేక కారణాలుంటాయి. బస్సుల కండిషన్, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్, బస్సులో ఎక్కిన ప్యాసింజర్ల సంఖ్య, డ్రైవర్ నైపుణ్యం లేదా డ్రైవర్ పనితీరు లాంటి అంశాలు కీలకంగా ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్క కారణం ఉన్నా బస్సు మైలేజీ తగ్గిపోతుందని అందరికీ తెలిసిందే. బస్సుల కండిషన్ బాగా లేకపోతే అందుకు యాజమాన్యం బాధ్యత వహించాలి.

రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. బస్సులో పరిమితికి మంచి ప్యాసింజర్లు ఎక్కినా లోడు పెరిగిపోయి మైలేజీ తగ్గిపోతుంది. నిజంగానే డ్రైవర్ నైపుణ్యం సరిగాలేని కారణంగా మైలేజీ తగ్గిపోతే సదరు డ్రైవర్ కు అవసరమైన శిక్షణ ఇప్పించాలి. అయినా మైలేజీ తగ్గిపోతోందంటే అప్పుడు డ్రైవర్ ను తప్పుపట్టాలి. సరే ఈ మొత్తం మీద అనకాపల్లి డిపోలో పనిచేస్తున్న అధికారులు ఎవరో ఓవర్ యాక్షన్ చేయడం వల్ల డ్రైవర్లకు నోటీసులు అందినట్లు తేలింది. కాబట్టి సమస్య పరిష్కారమైపోతుంది.