జిన్ పింగ్ ఆరోగ్యం విషమం?

డ్రాగన్ దేశపు అధినేత జిన్ పింగ్ ఆరోగ్యం విషమించినట్లు స్ధానిక మీడియా ప్రకటించింది. మెదడుకు సంబంధించిన ‘సెరిబ్రల్ అనూరిజం’ అనే వ్యాధితో బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ సమస్యతో జిన్ పింగ్ మూడేళ్ళుగా బాగా ఇబ్బంది పడుతున్నారట. సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధి మెదడుకు సంబంధించినదట. ఈ సమస్య జిన్ పింగ్ లో చాలా ఎక్కువై పోయిందని స్ధానిక మీడియా వెల్లడించింది.

వ్యాధి ముదిరి పోవటంతో 2021 చివరలో కొద్దిరోజులు ఆసుపత్రిలో కూడా చేరారు. అనారోగ్యం కారణంగానే కరోనా వైరస్ తీవ్రత,  వింటర్ ఒలంపిక్స్  వరకు జిన్ పింగ్ విదేశీ నేతలను, అతిధులను ఎవరినీ కలవలేదు. జిన్ పింగ్ కు ఉన్న సమస్య కారణంగా మెదడులోని రక్తనాళాల గోడల్లోని కండరాలు బాగా బలహీనపడతాయట. దీనివల్ల మెదడులోని రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల రక్తనాళాలు ఎప్పుడు పగిలిపోతాయో కూడా ఎవరు చెప్పలేరు.

రక్తనాళాలు పగిలితే వెంటనే మెదడు చుట్టూ రక్తస్రావం మొదలవుతుంది. ఈ రక్తస్రావం కారణంగా జిన్ పింగ్ కు స్ట్రోక్ రావటమో లేకపోతే కోమాలోకి వెళ్ళటమో లేకపోతే మరణించినా ఆశ్చర్య పోవక్కర్లేదని మీడియా చెప్పింది. అసలీ సమస్య జిన్ పింగ్ లో 2019లో మొదటిసారి బయటపడింది. ఇటలీ పర్యటనలో ఉన్నపుడు జిన్ పింగ్ కొన్నిసార్లు సరిగా నడవలేకపోయారు.

తర్వాత ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నపుడు కొన్నిసార్లు కుర్చీలో కూర్చోవటానికి కూడా బాగా ఇబ్బంది పడ్డారు. పై రెండు సంఘటనలను గమనించిన డాక్టర్లు వెంటనే జిన్ పింగ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడే సెరిబ్రల్ అనూరిజంతో అధినేత ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. 2020లో షెన్ జెన్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటపుడు కూడా అధ్యక్షుడు హఠాత్తుగా దగ్గుతో బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటి నుండి జిన్ పింగ్ కు వైద్యులు రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహిస్తునే ఉన్నారు. ఇపుడు పరిస్ధితి విషమించటంతో అర్జంటుగా ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తేల్చారట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.