అమెరికా ఆంక్షలను లెక్కే చేయటం లేదా?

ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా చేస్తున్న వార్నింగులను మన పాలకులు అసలు ఏమాత్రం లెక్కే చేయడం లేదు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయకూడదని, ఆయుధాల కొనుగోళ్ళు ఆపేయాలని అగ్రరాజ్యం మన పాలకులపై ఆంక్షలను పెడుతోంది. ఉక్రెయిన్  పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం మూడో నెలకు చేరుకుంది. ఈ నేపధ్యంలోనే భారత్ పై అమెరికా ఆంక్షలను బాగా పెంచుతోంది. అయితే మనదేశం ఏ మాత్రం లెక్కచేయటం లేదు.

అమెరికా ఆంక్షలను పెంచే కొద్దీ రష్యా నుంచి కొనుగోళ్ళను మనపాలకులు మరింతగా పెంచుతున్నారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక అమెరికా దిక్కులు చూస్తోంది. రష్యా నుండి మనకు దిగుమతయ్యే చమురు సుమారు 1 శాతముంటుంది. మనకు ఎక్కువుగా ఆయల్ గల్ఫ్ దేశాల నుండే దిగుమతవుతుంది. అయితే ఒపెక్ దేశాలు చెప్పిన ధరే వేదం తప్ప బేరమాటడానికి వేరే దారిలేదు.

అయితే తాజా యుద్ధం కారణంగా రష్యాకు భారీ ఎత్తున నిధులు కావాల్సొచ్చింది. అందుకనే చమురును తక్కువ ధరలకే అమ్ముతామని మనకు చెప్పింది. ధర తక్కువ, పైగా కావాల్సినంత చమురును ఒకే ధరకు అందులోను రూపాయిల్లో చెల్లించేందుకు రష్యా అంగీకరించింది. దాంతో వెంటనే చమురును అవసరమైనంత కొనుగోలు చేయటానికి మన దేశం రెడీ అయిపోయింది. ఈ విషయంలో అమెరికా ఎన్ని ఆంక్షలను విధించినా మన పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

అలాగే ఆయుధాలను కూడా రష్యా నుండి కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోకన్నా తక్కువ ధరలకే ఆయుధాలను అందిస్తామని రష్యా ఇచ్చిన ఆఫర్ మన పాలకులను చాలా టెంప్ట్ చేస్తోంది. యుద్ధ సమయంలో రష్యాకు నిధులు అవసరమైంది కాబట్టి ఆయిల్, ఆయుధాలను తక్కువ ధరలకే అమ్ముతామని రష్యా చెప్పటంతో మన పాలకులు కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకనే అమెరికా, నాటో దేశాలు ఎంత గోల చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. అందుకనే రష్యా-భారత్ మధ్య జరుగుతున్న లావాదేవీలను అమెరికా చూస్తు కూర్చోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు.