అబ్బాయి గొంతు కోసిన అమ్మాయి.. ట్విస్టేంటంటే?

ఇది చెప్పుకోవ‌డానికి చిన్న క్రైమ్ న్యూసే. ఈ ఉదంతంలో ఎవ‌రి ప్రాణాలు కూడా పోలేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమ‌వారం హాట్ టాపిక్‌గా మారి.. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన న్యూస్ ఇదే. ఎందుకంటే ఆ ఉదంతం అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌నిది. ఇలాంటి వ్య‌క్తులు కూడా ఉంటారా అని అంద‌రూ షాక‌య్యేలా చేసిన ఓ అమ్మాయి వ్య‌వ‌హారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మామూలుగా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? త‌న త‌ల్లిదండ్రుల‌కు ఆ విష‌యం చెబుతుంది.

వాళ్లు వినిపించుకోకుంటే పెళ్లి కుదిరిన అబ్బాయికి విష‌యం చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. అలా కాని ప‌క్షంలో త‌న‌కు న‌చ్చిన వాడితో వెళ్లిపోతుంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన‌కాప‌ల్లి జిల్లాకు చెందిన వియ్య‌పు పుష్ప అనే అమ్మాయి మాత్రం ఎవ్వ‌రూ ఊహించ‌ని ప‌ని చేసింది. కాబోయే వాడి గొంతు కోసి చంపేయబోయింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికి అంగీక‌రించి, రామానాయుడు అనే అబ్బాయితో క‌లిసి పెళ్లి కోసం షాపింగ్ కూడా చేసిన ఆమె.. షాపింగ్ నుంచి తిరిగి ఇంటికి వ‌చ్చే దారిలో ఒక ఆశ్ర‌మం ద‌గ్గ‌రికి అత‌ణ్ని తీసుకెళ్లింది.

అక్క‌డ ఒక స‌ర్ప్రైజ్ ఇస్తానంటూ రామానాయుడి క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టింది. త‌నకు ఏం గిఫ్ట్ ఇస్తుందో అని ఉత్సుక‌త‌తో చూసిన అబ్బాయికి ఆమె పెద్ద షాకే ఇచ్చింది. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోసేసింది. అతను ప్రాణాపాయ స్థితికి చేరాడు. ఐతే మీడియాలో, సోషల్ మీడియాలో ముందు జరిగిన ప్రచారం ఏంటంటే.. ఆ అమ్మాయే భయపడి అతణ్ని ఆసుపత్రికి చేర్చిందని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఇలా అతణ్ని చంపబోయినట్లు చెప్పింది అని. ఐతే ప్రాణాపాయం తప్పించుకున్న ఆ అబ్బాయి ఆసుపత్రి నుంచి ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడాడు.

ఆ అమ్మాయి తన గొంతు కోశాక భయపడి తాను కూడా చచ్చిపోతా అని అందని, దీంతో ఆమె ఏం చేసుకుంటుందో ఏమో అని గొంతు నుంచి రక్తం కారుతున్నప్పటికీ..తనే స్కూటీలో తనను ఎక్కించుకుని ఆ కొండ మీది నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వచ్చానని రామానాయుడు వెల్లడించాడు. ఈ సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి.. ఇతను మగజాతి ఆణిముత్యం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రామానాయుడిని కొనియాడుతుండటం విశేషం.