ఉక్రెయిన్ యుద్ధం… కొత్త మలుపు తీసుకోనుందా?

రష్యాతో యుద్ధం కారణంగా పూర్తిగా నేలమట్టమైపోతున్న ఉక్రెయిన్లో దేశాధ్యక్షులు పర్యటించారు. తాజాగా నాటోలో సభ్యత్వం ఉన్న నాలుగు దేశాల అధినేతలు ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ మధ్యనే బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హఠాత్తుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రత్యక్షమై యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. బోరిస్ చూపిన మార్గంలోనే పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాల అధ్యక్షులు పర్యటించారు.

రష్యా దెబ్బకు ఉక్రెయిన్ శిధిలమై పోతే తర్వాత సమస్య తమ దేశాలకే వస్తుందనే ఆందోళనతోనే పై దేశాల అధ్యక్షులు ముందుజాగ్రత్తగానే ఉక్రెయిన్లో పర్యటించి మద్దతు పలికారు. పై దేశాల అధ్యక్షులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి ప్రధానమంత్రి డెనిస్ తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ కు అవసరమైన అన్ని రకాల సాయాలను చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే రష్యా యుద్ధాన్ని ఆపకపోతే ఉక్రెయిన్ కు నాటో దేశాల నుండి సైనిక, ఆర్ధికపరమైన సాయం చేయటానికి తాము రెడీగా ఉన్నామనే సంకేతాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు పంపటమే వీళ్ళ ఉద్దేశ్యంగా కనబడుతోంది.

ఇప్పటికి జరిగిన నష్టాలను పై దేశాల అధ్యక్షులు ఉక్రెయిన్ ప్రధానిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్నాయి. ప్రత్యక్షంగా తమ దేశాల నుంచి సైనికులు ఉక్రెయిన్ లో అడుగుపెట్టలేదు. అయితే తమ దగ్గరున్న అత్యంత ఆధునికమైన ఆయుధాలను మాత్రం ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి. అలాగే భారీ ఎత్తున నిధులను అందిస్తున్నాయి. పనిలోపనిగా సహాయ పునరావాస కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి.

అయితే రష్యా కనుక యుద్ధాన్ని ఆపకపోతే తమ స్వీయ రక్షణలో భాగంగానే ఉక్రెయిన్ కు డైరెక్టుగా మద్దతు పలకాల్సిన అనివార్యత ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇపుడు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా రేపు ఏదో కారణంతో తమపైన కూడా యుద్ధానికి దిగదని గ్యారెంటీ ఏమీలేదని పై దేశాల అధ్యక్షులు ఆందోళన వ్యక్తంచేశారు. అందుకనే ముందు జాగ్రత్తగా ఉక్రెయిన్ కు సంఘీభావం తెలపటానికే తాము ప్రత్యక్షంగా తమ దేశాలనుండి రైల్లో ప్రయాణించి కీవ్ చేరుకున్నట్లు గిటనస్ నౌసెదా, ఎస్తోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, పోలండ్ అధ్యక్షుడు ఆంద్రెజ్ దుడా, లాత్వియా అధ్యక్షుడు ఈగిల్స్ లెవిట్స్ చెప్పారు.