రిలయన్స్ జియోకు సీఐఎస్ఎఫ్ భద్రత?

వినటానికి విచిత్రంగానే ఉంది. మామూలుగా ప్రజల ఆస్తులకు అంటే ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించటం ఇప్పటివరకు మనం వినుంటాము. ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులు, రైల్వేస్టేషన్లు లేదా ఇంకేవైనా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు తదితరాలకు ప్రభుత్వ భద్రత కల్పించటం సహజమే. కానీ ఒక ప్రైవేటు వ్యాపార సంస్ధకు ప్రభుత్వానికి చెందిన భద్రతా దళాలను ఉపయోగించటం బహుశా ఇదే మొదటిసారేమో.

ముఖేష్ అంబానీకి చెందిన ముంబయ్ లోని రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్ కు సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దళాలతో భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వాణిజ్య వినోద కేంద్రానికి 200 మంది సీఐఎస్ఎఫ్ దళాలతో సెక్యూరిటీ ఇచ్చేందుకు కేంద్రం డిసైడ్ చేసింది. ఉగ్రవాద, విధ్వంసకర శక్తుల నుండి జియో సెంటర్ కు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం అందించాయి. దాని నివేదిక ప్రకారం జియో సెంటర్ కు ప్రత్యేకమైన సెక్యూరిటీని కల్పించింది. 

మామూలుగా ప్రైవేటు సంస్థలకు ఏదైనా సెక్యూరిటీ సమస్యలుంటే అవే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకుంటాయి. అంతేకానీ ఇలాగ సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలను ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం కేటాయించటం బహుశా ఇదే మొదలు. ఇదే పద్దతిలో మిగిలిన కార్పొరేట్ సంస్ధల యాజమాన్యాలు కూడా సీఐఎస్ఎఫ్ భద్రతా దళాల రక్షణ కావాలని డిమాండ్లు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది ?

ఒకవైపేమో వీవీఐపీలకు సీఐఎస్ఎప్ సెక్యూరిటీని తగ్గించేస్తు మరోవైపు కార్పొరేట్ సంస్ధయిన జియోకు కేటాయించటం వివాదాస్పదమవుతోంది. ముంబయ్ లోని ముఖేష్ కు చెందిన  యాంటిలియా నివాస భవనం ముందు అనుమానితులు తచ్చాడుతున్నారని, హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.