థియేటర్లో ఎంతమంది చనిపోయారు ?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ భీకర రూపం దాలుస్తోంది. తాజాగా రాజధాని కీవ్, మేరియా పోల్ నగరాలపై రష్యా బాంబులతో భీకరంగా విరుచుకుపడుతోంది. 20 రోజులు దాటిన యుధ్ధంలో రష్యా కురిపిస్తున్న బాంబులు జనావాసాలు, ఆసుపత్రులపై కూడా పడుతున్నాయి. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. మేరియాపోల్ నగరంలోని ఒక థియేటర్ పై రష్యా వైమానిక దళం బాంబులు కురిపించింది.

ఈ దాడికి మొత్తం థియేటరంతా ధ్వంసమై పోయింది. ఇందులో ఎంతమంది చనిపోయారనే విషయంలో క్లారిటిలేదు. ఎందుకంటే చుట్టుపక్కలున్న వాళ్ళని నగరపాలక సంస్ధ ఉన్నతాధికారులు థియేటర్లలోకే తీసుకొచ్చారు. అధికారుల లెక్క ప్రకారం బాంబుదాడి జరిగిన సమయానికి థియేటర్లో సామారు 1200 మంది ఉన్నారట. వరుస బాంబుల దెబ్బకు అందరు చనిపోయారా ? లేక ఎవరైనా తప్పించుకోవటమో లేదా తీవ్రగాయాలతో బయటపడ్డారా అన్నది కూడా తెలీటంలేదు.

బాంబుదాడి నుండి ఎవరైనా గాయాలతో బయటపడినా వాళ్ళకి వెంటనే వైద్యం చేయించేందుకు ఆసుపత్రుల సౌకర్యం కూడా లేదని అధికారులు చెప్పారు. అధికారుల అనుమానాలైతే బాంబుదాడుల దెబ్బకు చనిపోయిన వాళ్ళ సంఖ్య భారీగానే ఉండచ్చట. అందుబాటులోకి వచ్చిన వీడియోలు, ఫొటోలను చూస్తుంటే ఎవరు కూడా బతికుండ అవకాశాలు లేవని చెప్పచ్చు. ఇదే విషయమై ఉక్రెయిన్ సైనికాధికారులు మాట్లాడదుతు రష్యా చాలా క్రూరంగా వ్యవహరిస్తోందన్నారు.

జనావాసాలపైన కూడా రష్యా బాంబులు చేస్తోందంటూ మండిపోయారు. ఇపుడు మేరియా పోల్ నగరంలో సుమారు 3 లక్షలమంది ఇరుక్కుపోయారట. వీళ్ళల్లో అత్యధికులు తిండి, మంచినీళ్ళు, వైద్యం అందక నానా అవస్తలు పడుతున్నారు. వీళ్ళకు సాయం అందించకుండా చుట్టుపక్కల ప్రాంతాలను రష్యా దిగ్బంధనం చేయటంతో ఏమి చేయాలో ఎవరికీ తోచటంలేదు. కీవ్ లోని 12 అంతస్తులు అపార్ట్ మెంట్ పై జరిగిన దాడిలో మొత్తం అపార్ట్ మెంటంతా మంటల్లో చిక్కుకుపోయింది. ఇందులో ఎంతమంది ఉంటున్నారో లెక్కలేదు. మొత్తానికి యుద్ధ తీవ్రతను రష్యా మెల్లిగా పెంచుకుంటూ పోతోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ సైనికులని, మామూలు జనాలని కూడా చూడటం లేదు. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ? చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.