సన్‌రైజర్స్.. వీళ్లు మారరా?

ఐపీఎల్‌లో ప్రస్తుతం అతి తక్కువ ఆదరణ, అభిమాన గణం ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది సన్‌రైజర్స్ అనడంలో మరో మాట లేదు. ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ అయినా ఎక్కడ జట్టును ఏర్పాటు చేస్తుంటే ఆ ప్రాంతంలో లోకల్ అభిమానులను ఆకట్టుకోవడానికి ఏమేం చేయాలో అంతా చేస్తుంది. వీలైనంత మేర స్థానిక ఆటగాళ్లను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే స్థానికంగా ప్రమోషనల్ కార్యక్రమాలు బాగా చేసి, అభిమానులను ఎంగేజ్ చేసి, వాళ్లంతా ఇది మన జట్టు అనుకునేలా చేస్తుంది.

కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ వెనుకే. ఆ జట్టులో తెలుగు ఆటగాళ్ల కోసం ఎప్పుడూ భూతద్దం పెట్టి వెతకాల్సిందే. కొన్నేళ్లుగా అయితే తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదు. ఒకరిద్దరు కూడా ఆ జట్టులో కనిపించడం లేదు. అలాగని లోకల్ టాలెంట్ అసలే లేదా అంటే అదేమీ కాదు.

ఇక్కడి కుర్రాళ్లు వేరే ఫ్రాంఛైజీల్లో అవకాశం దక్కించుకుని సత్తా చాటుతున్నారు.హైదరాబాదీ పేసర్ అయిన మహ్మద్ సిరాజ్ వేరే ఫ్రాంఛైజీలకు ఎంపికై, అక్కడ సత్తా చాటి టీమ్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అంబటి రాయుడు ఎప్పట్నుంచో వేరే ఫ్రాంఛైజీలకు ఆడుతున్నాడు. ఇలాంటి ప్రతిభావంతులు మరింత మంది ఉన్నారు. కానీ వాళ్లెవ్వరూ సన్‌రైజర్స్‌కు కనిపించరు. ఈ సారి వేలంలో ఒక్క తెలుగు ఆటగాడినీ తీసుకోలేదా జట్టు. తిలక్ వర్మ, రాహుల్ బుద్ధి, అశ్విన్ హెబ్బర్.. ఇలా చాలామంది తెలుగు యువ ప్రతిభావంతుల్ని వేరే ఫ్రాంఛైజీలు తీసుకున్నాయి. సన్‌రైజర్స్ వీళ్లెవ్వరి గురించి కనీస ప్రయత్నం కూడా చేయలేదు.

సన్‌రైజర్స్ తీరు మొదట్నుంచి ఇంతే అసలు. ఆ జట్టుకు మొదట్లో లోకల్ సపోర్ట్ అంతంతమాత్రం. ఐతే డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ లాంటి ఆకర్షణీయ క్రికెటర్లు ఆ జట్టుతో చేరాక పరిస్థితి మారింది. స్థానికంగా ఆదరణ పెరిగింది. వాళ్లు ఆటతోనే కాక తమ వ్యక్తిత్వంతోనూ మన అభిమానులను ఆకట్టుకున్నారు. కానీ మనవాళ్లు ఎంతో ఇష్టపడే వార్నర్‌ను అవమానించి బయటికి పంపించేసింది సన్‌రైజర్స్. రషీద్ సైతం జట్టును వీడాడు. దీంతో పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన సన్‌రైజర్స్.. కొత్తగా చెప్పుకోదగ్గ ఆకర్షణ ఉన్న ఆటగాళ్లెవ్వరినీ  దక్కించుకోలేదు. స్థాని ఆటగాళ్లనూ విస్మరించింది. ఇది చూసి ఈ జట్టు మారదింక అని లోకల్ ఫ్యాన్స్ దాన్ని దూరం పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.