క‌ర్ణాట‌క‌లో హిందూ-ముస్లిం వివాదం.. ఎందుకంటే?

కర్ణాటక ర‌గులుతోంది. కొన్ని రోజులుగా నెల‌కొన్ని చిన్న వివాదం చినికి చినికి గాలివాన‌గా మారింది. హిందూ-ముస్లింల మ‌ధ్య మ‌రింత ఘ‌ర్స‌ణ‌ల‌కు దారితీస్తోంది. హిజాబ్(ముస్లిం మ‌హిళ‌లు ధ‌రించే ఒక విధ‌మైన వ‌స్త్రం) వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హిజాబ్ నిబంధన అనేక విద్యాసంస్థల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోవడం వల్ల సెలవులు ప్రకటించాల్సిన గత్యంతరం ఏర్పడింది. విద్యా సంస్థలను మూడు రోజులు మూసేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అందరూ సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు.

మరోవైపు, అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఉడుపి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల విద్యార్థినులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది. కొందరు చెడ్డ వ్యక్తులే సమస్యను మరింత తీవ్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది.  మ‌రోవైపు అనేక విద్యా సంస్థల్లో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. హిజాబ్ ధరించి వచ్చిన వారిని అడ్డుకోవడంపై మహిళలు అభ్యంతరం చెప్పగా.. వారిని అనుమతించిన కళాశాలలో ఇతర విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని రావడం వివాదాస్పదమైంది.

శివమొగ్గలోని ప్రభుత్వ డిగ్రీ కళాళాల వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ కూడా పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లారు. కాషాయ శాలువాలు ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజ్లోకి అనుమతించకపోవడం వల్ల వారు బయట నిరనసన చేపట్టారని, అనంతరం మరో వర్గం విద్యార్థులు అక్కడకు రావడం హింసకు దారితీసిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

శివ‌మొగ్గ జిల్లాలోని బాపూజీ నగర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. హిజాబ్ ధరించిన విద్యార్థులకు, కాషాయ కండువాలు ధరించిన వారికి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఘర్షణ.. చివరకు రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరుకుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.

ఉడుపి జిల్లాలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కళాశాలలోనూ నిరసనలు భగ్గుమన్నాయి. హిజాబ్ ధరించిన ముస్లిం యువతులు న్యాయం కోసం నిరసన ప్రదర్శన చేపట్టగా.. కాషాయ కండువాలు ధరించిన వ్యక్తులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, మరో వర్గం నీలి రంగు కండువాలు కప్పుకొని హిజాబ్కు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

అత్యంత కీల‌క‌మైన జిల్లా విజయపురలోనూ హిజాబ్ వివాదం ముదురుతోంది. క్లాస్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతేశ్వర ప్రీ యూనివర్సిటీ విద్యార్థులు కాషాయ కండువాలతో వచ్చారు. అయితే సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం క్లాసులు సస్పెండ్ చేసి సెలవు ప్రకటించారు.

మండ్య జిల్లాలోని పీఈఎస్ కళాశాలలో హిజాబ్ ధరించిన ఓ యువతిని కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తులు హేళన చేశారు. కళాశాలకు వచ్చిన యువతిని చూసి మతపరమైన నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ఆ మహిళ సైతం నినదించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కళాశాల యజమాన్యం కల్పించుకొని కాషాయ దళాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది.