టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై.. కారణమిదే: కోహ్లీ

తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల విరాట్ కోహ్లి బాగానే హర్టయినట్లున్నాడు. ఈ విషయంలో ఇంతకుముందే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లి.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ బీసీసీఐతో పాటు సహచర ఆటగాళ్లకు, అలాగే అభిమానులకు పెద్ద షాకిచ్చాడు విరాట్. ఈ మేరకు శనివారం సాయంత్రం విరాట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు.

టెస్టు కెప్టెన్‌గా జట్టును సరైన దిశలో నడిపించడానికి ఏడేళ్ల పాటు ఎంతో కష్టపడ్డానని.. ఐతే ప్రతి ప్రయాణం ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే అని.. టెస్టు సారథిగా ఇప్పుడు తన ప్రయాణం ఆపాల్సిన సమయం వచ్చిందని కోహ్లి చెప్పాడు. తాను ఎప్పుడూ ఏ విషయంలో అయినా నూటికి 120 శాతం అంకిత భావం చూపించాలని భావిస్తానని.. అలా చేయలేనపుడు ఆ బాధ్యతలో కొనసాగడం సరైంది కాదని అనుకుంటానని.. తాను ఏం చేస్తున్నానో తనకు పూర్తి స్పష్టత ఉందని.. జట్టు పట్ల నిజాయితీ లేకుండా ఉండలేనని అన్నాడు కోహ్లి.

ఇంత సుదీర్ఘ కాలం తనకు సారథిగా వ్యవహరించే అవకాశం కల్పించిన బీసీసీఐకి.. కెప్టెన్‌గా తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన ధోనీకి కోహ్లి కృతజ్ఞతలు చెప్పాడు. కోచ్ రవిశాస్త్రితో కలిసి టెస్టుల్లో భారత జట్టును గొప్ప స్థితికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విరాట్. 2014 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ధోని మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించగా.. చివరి టెస్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు కోహ్లి. ఆ తర్వాత కొన్నేళ్లకు వన్డే, టీ20 పగ్గాలు కూడా దక్కాయి.

దాదాపు నాలుగేళ్లు మూడు ఫార్మాట్లలోనూ అతను సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఐతే మూడు నెలల కిందట టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీ20 కెప్టెన్సీని స్వచ్ఛందంగా వదులుకున్నాడు కోహ్లి. గత నెలలో కోహ్లిని వన్డే కెప్టెన్‌గా తప్పిస్తూ బీసీసీఐ అతడికి షాకిచ్చింది. వన్డేలు, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సబబు కాదన్న ఉద్దేశంతో వన్డే పగ్గాలు కూడా రోహిత్‌కే అప్పగించారు. ఇది కోహ్లికి రుచించలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసే వరకు ఎదురు చూసి ఇప్పుడు టెస్టు పగ్గాలు వదిలేశాడు.